ఏ వ్యాధిఅయినా.. తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. ముదిరే వరకూ పట్టించుకోకుండా.. చివరి దశలో చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు.. గర్భాశయ క్యాన్సర్ వ్యాధి పూర్తిస్థాయి క్యాన్సర్గా రూపాంతరం చెందడానికి పదేండ్ల సమయం పడుతుంది. ఈలోపే నిర్ధారణ పరీక్షలద్వారా కనిపెట్ట గలిగితే రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు.
ఇరవైలలో..
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను గుర్తించే పాప్ స్మియర్ టెస్టు చేయించుకోవాలి. గర్భాశయ కణాల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకుని ఉంటే ఈ పరీక్ష ద్వారా ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చు.
ముప్పైలలో..
ఐరన్ లోపం, రక్తహీనత ఈ వయసు మహిళలను ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా గర్భిణులు, పసిపిల్లల తల్లులు ఈ లోపాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా, తల తిరిగినట్టు ఉన్నా ఐరన్ శాతం నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ను సంప్రదించకుండా ఎలాంటి విటమిన్ ట్యాబ్లెట్లూ వాడొద్దు.
నలభైలలో..
ఈ వయసులో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్ లక్షణాలేవైనా కనిపించినా, కుటుంబంలో ఎవరికైనా గతంలో ఈ వ్యాధి ఉన్నా మరింత వేగంగా స్పందించాలి.
యాభైలలో..
వరుసగా 12 నెలలు నెలసరి రాకపోతే దాన్ని మెనోపాజ్ అని పిలవవచ్చు. ఈ సమయంలో రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉన్నట్టుండి ఒళ్లు వెచ్చబడటం, మానసిక ఆందోళనలకు గురికావడం, లైంగిక జీవితం మీద ఆసక్తి తగ్గడం లాంటివి జరుగుతాయి. మెనోపాజ్కు సంబంధించి ఏ లక్షణాలు ఇబ్బంది పెడుతున్నాయో గమనించి చికిత్స తీసుకోవాలి.
అరవైలలో..
వయసుతో పాటు కండరాలు, ఎముకల్లో బలం తగ్గిపోతూ వస్తుంది. దీంతో ఆస్టియోపోరోసిస్కు ఆస్కారం ఎక్కువ. ఎముకలు పెళుసుబారిపోయి చిన్న దెబ్బ తగిలినా విరిగిపోతాయి. అందుకే అరవై దాటిన ఆడవాళ్లు బోన్ డెన్సిటీ (ఎముకల సాంద్రతను తెలిపే) టెస్టులు చేయించుకోవాలి.
అరవై అయిదు తర్వాత..
వయసు పెరుగుతున్నకొద్దీ స్క్రీనింగ్ టెస్టుల అవసరం పెరుగుతుంది. ఏటా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే చూపు, వినికిడికి సంబంధించిన పరీక్షలూ తప్పనిసరి. హృద్రోగ పరీక్షలు కూడా అత్యవసరమే. అలాగే మానసిక ఆరోగ్యాన్ని బట్టి డిప్రెషన్కు సంబంధించిన టెస్టులూ సిఫారసు చేస్తారు.