మనం కొత్త ఏడాది అనేక తీర్మానాలు చేసుకుంటాం. బరువు తగ్గాలనుకోవడం, వ్యాయామం చేయాలనుకోవడం, పోషకాహారం తీసుకుంటామని సంకల్పించుకోవడం.. ఈ కోవలోవే. ఇక ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్లయితే… ‘తెల్లవారుజామునే మేల్కొంటాం. ఆసనాలు, ఆధ్యాత్మిక సాధనలు చేస్తాం. అధ్యయనానికి సమయం కేటాయించుకుంటాం’ అన్న తీర్మానాల వైపు మొగ్గుచూపుతారు. ఏ ఆలయానికో వెళ్లి ఆ మేరకు వాగ్దానం చేసేవారూ ఉన్నారు. అయితే, జనవరిలో మొదలైన తీర్మానం ఫిబ్రవరి వచ్చేసరికి తేలిపోతుంది. మళ్లీ పాత పద్ధతులే. సంకల్ప బలం లేకపోతే ఏ చిన్న నిర్ణయాన్నీ ఆచరణలో పెట్టలేం. కాబట్టి, మనం తీసుకునే కొత్త ఏడాది తీర్మానం బలమైనదై ఉండాలి. బలహీనమైన మనసుతో కాకుండా, అత్యున్నత స్థాయి జ్ఞానంతోనే ఏ మార్పు అయినా సాధ్యం. ఒక దగ్గర కూర్చొని ‘నా జీవిత అత్యున్నత ప్రయోజనం, కర్తవ్యం ఏంటి?’ అని ఆలోచించుకోవాలి. ఒక్కసారి మంచి మార్గంలో నడవాలని సంకల్పం చేసుకుంటే, మనల్ని చేయిపట్టుకుని నడిపించడానికి గురువులు సిద్ధంగా ఉంటారు. పవిత్ర గ్రంథాలు అండగా ఉంటాయి. కొత్త ఏడాది మనల్ని ధర్మం వైపు నడిపించాలి. మనలో గూడుకట్టుకున్న భ్రమలు, అజ్ఞానం తొలగిపోవాలి. మన ఆధ్యాత్మిక సాధనలు బలంగా, ఉత్సాహంగా సాగిపోవాలి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని రాసుకోగలిగే శక్తి మనకు లభించాలి. బంధాలు, కోరికలు అనే వేయి తలల సర్పాల నుంచి మన మనసుకు విముక్తి కలగాలి. అదీ పరిపూర్ణమైన మార్పు అంటే!
-ఆనందమూర్తి గురుమా