నేనొక తీవ్ర సమస్యతో బాధపడుతున్నాను. నా వయసు పద్దెనిమిది. ఇంజినీరింగ్ చదువుతున్నాను. మొదట్లో హోమ్సిక్తో సరిగా చదవలేక పోయేదాన్ని. ఒకవేళ చదువుదామని పుస్తకం తెరిచినా.. వెంటనే తలనొప్పి వచ్చేది. ఏవో పిచ్చిపిచ్చి ఆలోచనలు. చాలా ఒత్తిడి అనుభవించాను. నా బాధను గమనించి నా రూమ్మేట్ కొన్ని మాత్రలు ఇచ్చింది. అవి మానసికశక్తిని ఇస్తాయని చెప్పింది. వాటిని వేసుకోగానే చాలా ఉత్సాహం వచ్చేది. దీంతో క్రమం తప్పకుండా తీసుకునేదాన్ని. నా మానసిక పరిస్థితి బాగానే ఉందని అనిపించాక ఆపేశాను. అప్పట్నుంచీ చేతులు వణుకుతున్నాయి. తల నొప్పిగా, బరువుగా ఉంటున్నది. చదువుపై ధ్యాస కుదరడం లేదు. నా సీనియర్ చదువు పూర్తయి వెళ్లిపోయింది. తాను ఇచ్చింది మాదకద్రవ్యం అని ఇప్పుడు అర్థం అవుతున్నది. నేను డ్రగ్స్కు బానిస అయినట్టు అనుమానం. ఈ విషయం కాలేజ్లో తెలిస్తే నన్ను బహిష్కరించే అవకాశం ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సోదరి
మీరు వాడుతున్నది ఎలాంటి మాత్రలన్నది సరిగా చెప్పలేదు. అవేమిటో, వాటి వల్ల దుష్ప్రభావాలేమిటో మీకూ తెలియదు. కొన్ని ట్యాబ్లెట్స్ తేలికపాటి మానసిక ప్రశాంతతను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వాటిని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. నిర్ణీత డోసేజ్ ప్రకారమే వాడాల్సి ఉంటుంది. మీకు డ్రగ్స్ తీవ్రత గురించి తెలుసు కాబట్టి, ఆ అలవాటును మాన్పించడం పెద్ద కష్టమేం కాదు. మొదట ఆ అపరాధ భావన వదిలేయండి. ఆలస్యం చెయ్యకుండా వైద్యుణ్ని సంప్రదించండి. మీ సమస్యను క్షుణ్నంగా చెప్పండి. మీరు ఇప్పటికే ఆ మత్తుకు బానిసగా మారిపోయి ఉంటే.. ఆ అలవాటును వదిలించు కోవడానికి నిపుణుల సాయం కావాలి. అందుకే మీరు వాడుతున్న మాత్రలను ఒకసారి వైద్యులకు చూపించండి. ఈ ప్రయత్నంలో కుటుంబసభ్యులు, స్నేహితుల సహాయం తీసుకోండి. జీవితం అన్నాక తప్పులు జరుగుతాయి. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సిందే. అప్పుడే చదువుపై దృష్టిపెట్టగలరు.