ఎండాకాలం మినహా మిగిలిన రుతువుల్లో పొద్దునే చన్నీటి స్నానం చేయాలంటే వణికిపోతారు. కానీ చన్నీటి షవర్ల కారణంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నెదర్లాండ్స్లో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో.. వేడినీటి షవర్లతో స్నానం చేసేవారితో పోలిస్తే, చన్నీటి షవర్లు చేసేవారు అనారోగ్యం బారినపడే అవకాశం తక్కువని తేలింది. దీనికోసం పరిశోధకులు మూడువేల మందిని నాలుగు భాగాలుగా విభజించి అధ్యయనం చేశారు. రోజూ వేడినీటి షవర్తో స్నానం చేయమని అన్ని వర్గాల వారికీ సూచించారు. అయితే.. ఒక వర్గం వారిని షవర్ చివర్లో 30 సెకన్లు, మరో వర్గాన్ని 60 సెకన్లు, ఇంకోవర్గాన్ని 90 సెకన్ల పాటు చన్నీటితో స్నానం ముగించాలని కోరారు. మిగిలిన వర్గానికి వేడినీళ్ల షవర్ మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. ఇలా మూడు నెలల అధ్యయనం తర్వాత, చన్నీటి షవర్ చేసినవారు అనారోగ్యంతో సెలవు పెట్టడంలో 29 శాతం తగ్గుదల కనిపించిందట. ఈ లెక్కల ఆధారంగా.. చన్నీటి షవర్ వల్ల రోగ నిరోధక శక్తి పెరిగే ఆస్కారం ఉందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. అంతేకాదు, దీనివల్ల రక్త సరఫరా కూడా మెరుగు పడిందట. మరోమాట, చన్నీటి షవర్లతో శారీరకంగా మాత్రమే కాకుండా, మానసికపరమైన లాభాలు కూడా ఉన్నాయి. ముఖం, మెడను చన్నీళ్లతో కడుక్కున్నప్పుడు వయోధికుల మెదడు పనితీరులో గణనీయమైన మెరుగుదల కనిపించిందట. మానసిక కుంగుబాటు లక్షణాల నుంచి ఉపశమనం కల్పించడంలో కూడా చన్నీటి జల్లు సహాయకారిగా ఉంటుందట.