బాలింతకు మొదటి కొద్దిరోజుల పాటు వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టించడం చాలా మంచిది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. భవిష్యత్తులో వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరు నెలల వరకు అసలు తల్లిపాలే తాగించకపోవడం, అవసరం లేకున్నా మార్కెట్లో లభించే ఆహారాన్ని ఇవ్వడం.. అంత మంచిదికాదు. మారుతున్న మాతృమూర్తుల అలవాట్లను గుర్తించిన ప్రొటీన్ సలహా సంఘం.. తల్లిపాల ప్రాధాన్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది.
ఆ తరువాత యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయంపై దృష్టి కేంద్రీకరించాయి. ఈ కృషి ఫలితంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నియమావళిని రూపొందించింది. ఇందులో తల్లిపాలకు బదులుగా ఇచ్చే కృత్రిమ ఉత్పత్తుల అనవసర వాడకాన్ని నిలువరించడానికి తగిన విధి విధానాలను క్రోడీకరించారు. దీనికి భారతదేశం కూడా ఆమోదం తెలిపింది.
తల్లులు నేర్చుకోవాలా?
నెలలు నిండిన తరువాత జన్మించిన శిశువుకు సహజంగా తల్లిపాలు తాగే శక్తి ఉంటుంది. ఇక, పాలు తాగించగలిగే నేర్పు స్త్రీలకూ సహజంగానే ఉన్నా.. నేర్చుకోవాల్సిన విషయాలూ కొన్ని ఉంటాయి. ఆ ప్రయత్నంలో ఇతరుల ప్రోత్సాహం, సహాయం కొంతమేర అవసరమే. గ్రామీణ ప్రాంతాలలో దాదాపు అందరూ బిడ్డకు పాలిస్తారు. కాబట్టి ఆ వాతావరణంలో పెరిగిన వారికి అనుమానాలు తక్కువే. కానీ సమస్య పట్టణవాసులతోనే. సరైన పరిస్థితులు, సలహా, సహకారం ఉంటేనే ప్రతి తల్లీ సంతోషంగా పాలు తాగించగలదు. తల్లిపాల ప్రాధాన్యం ఇప్పుడు కొత్తగా గుర్తించినదేం కాదు. మానవజాతికి ప్రకృతి ప్రసాదించిన అతిపెద్ద బహుమతి స్తన్యం. శుశ్రుతుని కాలం నుంచే తల్లిపాల విలువ తెలుసు. ‘నీ కుచద్వయంలో నాలుగు సముద్రాల పాలు ఉండుగాక’ అని ఆ రోజుల్లోనే వైద్యులు బాలింతలను దీవించేవారు.
– డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు