కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకే ఒక్కడు. ఎవరితోనూ పోల్చలేం. ఢిల్లీ వరకూ వెళ్లిన బడానేతలు ఎంతోమంది ఉండవచ్చు. సమ్మోహన శక్తిలో వారికి సున్నా మార్కులే. చాణక్యం చదివిన పాలకులు చాలామందే కనిపిస్తారు. చాకచక్యంగా జన హృదయాలను గెలిచినవారు మాత్రం మహా అరుదు. పుస్తకాల దొంతర్లను పుక్కిలించి మింగినవాళ్లు అక్కడక్కడా తారసపడవచ్చు. జనం భాష, హృదయ ఘోష అర్థం చేసుకునే శక్తి అంతంతమాత్రమే? కానీ కేసీఆర్ పరిపూర్ణ నాయకుడు. తాత్వికుడు, పండితుడు, కార్యదక్షుడు, శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు – అనేక పార్శాలతో అలరారే విశిష్ట వ్యక్తిత్వం ఆయనది.
కేసీఆర్.. వజ్ర సంకల్పుడు, సున్నిత మనస్కుడు. కోపమొస్తే రంకెలేస్తారు. ప్రేమ కలిగితే కరుణ కురిపిస్తారు. ఎవరికి కష్టమొచ్చినా తట్టుకోలేరు. ఆ సహానుభూతి కన్నీరై జలజలా రాలిన సందర్భాలూ అనేకం. అందరి కష్టం తన కష్టమనుకునే స్వభావం. ఎవరైనా సాయంకోరి వస్తే చేతనైనంత తోడ్పాటునిస్తారు. ఒక వరం అడిగితే రెండు కానుకలిస్తారు. రెండు కానుకలు కోరితే రెట్టింపు ప్రసాదిస్తారు. ఏమీ అడగనివారికి కూడా.. ఎంతైనా ఇచ్చేస్తారు. ఆ గుండెల్లో అపారమైన ఆర్ద్రత. ఆ ఆలోచనల్లో అంతులేని మానవీయత. సామాన్యుల పుట్టినరోజును అంకెల్లో గణిస్తారు. క్యాలెండరు ప్రకారం లెక్కిస్తారు. కానీ, కేసీఆర్ జన్మదినాన్ని.. బాగుపడిన జీవితాల్లో కొలవాలి. పొంగిపొర్లుతున్న జలాలతో తూచాలి. కాలరెగరేసిన ఆత్మాభిమానంతో తూకమేయాలి.
రవిబింబంబుపమింప బాత్రమగు చ్ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్నిండుచోన్
.. వామనుడు ఇంతింతై వటుడింతయై వృద్ధి చెందిన క్రమాన్ని పోతన సూర్యుడిని సాపేక్షంగా తీసుకుని అత్యద్భుతంగా వర్ణించాడు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు – కేసీఆర్ను ఆంధ్రా నాయకులు చాలా తక్కువగా అంచనా వేశారు. కానీ, వాళ్లు చూస్తుండగానే ఆయన జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. కేసీఆర్ ముందు ప్రత్యర్థులు అంగుష్ఠ మాత్రులుగా మిగిలారు.
నిశ్చిచ్య యః ప్రక్రమతే నాన్తర్వసతి కర్మణః
అవంధ్యకాలో వశ్యాత్మా స వై పండిత ఉచ్యతే
ఎవరికైతే దృఢ నిశ్చయంతో కూడిన కార్యాచరణ ఉంటుందో.. ఎవరైతే లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించరో.. ఎవరైతే కాలాన్ని వృథా చేయరో.. ఎవరైతే తమ చిత్తంపై నియంత్రణ కలిగి ఉంటారో.. వారినే మేధావి అని కీర్తిస్తాం. సమకాలీన రాజకీయాలలో ఆ కీర్తి కిరీటం కేసీఆర్దే!
తనిసిరే వేల్పులుదధి రత్నముల చేత?
వెఱచిరే ఘోర కాకోల విషము చేత?
విడిచిరే యత్నమమృతంబు వొడము దనుక?
నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు.
సముద్రంలో రత్నాలు కనిపించగానే దేవతలు మథనాన్ని ఆపలేదు. సముద్రం నుంచి విషం పుట్టినా వెనుకడుగు వేయలేదు. అమృతం వచ్చే వరకు పగ్గం విడువలేదు. ధైర్యవంతులు అనుకున్నది సాధించే వరకు కదలరు, వదలరు. కేసీఆర్ కూడా అంతే! తెలంగాణ సాకారం అయ్యేవరకూ వదలిపెట్టలేదు. బంగారు తెలంగాణ కోసం కార్యదీక్ష సాగిస్తూనే ఉన్నారు.
ఆ ఇంటికి దేవుడు!
భూక్య లక్ష్మి.. తెలంగాణ ఉద్యమకారిణి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఆమె స్వగ్రామం. కేసీఆర్ మీద అభిమానంతో టీఆర్ఎస్లో చేరింది. ఉద్యమంలో చురుగ్గా పనిచేసింది. ఎక్కడ ధర్నాలు, రాస్తారోకోలు జరిగినా వెళ్లేది. తెలంగాణ ఆవిర్భావానికి కొద్దిరోజుల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బోర్నపెల్లి గ్రామం ఎంపీటీసీ స్థానాన్ని గిరిజన మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్థానికేతరురాలు అయినా, భూక్య లక్ష్మిని ఒప్పించి బోర్నపెల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిపారు. కానీ కొద్ది ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. కొద్దిరోజులకు లక్ష్మి భర్త గంగారాం మృతిచెందాడు. దీంతో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయింది. అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత ఇంట్లో జరిగిన ఒక శుభకార్యానికి హైదరాబాద్ రావాలని లక్ష్మికి పిలుపు వచ్చింది. దీంతో లక్ష్మి తన పరిస్థితిని కండ్లకుకడుతూ ఒక లేఖను తయారు చేసుకొని హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్కు తన పరిస్థితిని వివరిస్తూ లేఖను అందించింది. కొద్ది సేపటికే లక్ష్మి సెల్కు ఫోన్ వచ్చింది. కేసీఆర్ ప్రగతిభవన్కు ఆహ్వానించారు. సకుటుంబంగా వెళ్లింది లక్ష్మి.
సీఎం ప్రేమగా లక్ష్మి కుటుంబ సభ్యులను భోజనానికి ఆహ్వానించారు. లక్ష్మి తటపటాయించడంతో ‘అమ్మా! అన్నం ముందు అంతా సమానమే’ అంటూ ఆమెతో కలిసి కూర్చొని భోజనం చేశారు. అనంతరం లక్ష్మికి ఆర్థికసాయం అందజేశారు. లక్ష్మిని ఆదుకోవాలంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఓ మోడల్ హౌజ్ నిర్మించి ఇవ్వాలని సూచించారు. ఐదు నెలల్లోనే ఆమెకు గూడు సమకూరింది. ‘సార్ రుణం తీర్చుకోలేనిది. ఇండ్లల్లకు పోయేటప్పుడు సార్ను పిలువాలని అనుకున్న కాని కాలేదు. సార్ ఫొటో ఇంట్లో పెట్టుకొని రోజూ దండం పెడుతున్నా. మా ఇంటి దేవుడు కేసీఆర్ సార్’ అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తుంది భూక్య లక్ష్మి.
– కొత్తూరి మహేశ్ కుమార్
అల్లాహ్ కరుణించిన రోజు
(సలీంభాయ్ స్వగతం)
“నమస్తే. నా పేరు మహ్మద్ సలీం. గోల్కొండ మోతీమహల్ ప్రాంతంలో ఉంటాం. గతంలో డ్రైవర్గా పనిచేశాను. నాలుగేండ్ల క్రితం బిల్డింగ్ పైనుంచి పడటంతో ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయింది. శాశ్వతంగా వికలాంగుడిని అయ్యాను. నాకు నలుగురు పిల్లలు. కుటుంబానికి నేనే ఆధారం. దీంతో, వికలాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేశాను. ఓ బ్రోకర్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఇల్లు కూడా మంజూరు కాలేదు. ఎలా బతకాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి. ‘దేవుడా! నా సమస్యలు నువ్వే పరిష్కరించాలి’ అని ఎన్నోసార్లు వేడుకున్నాను. ‘ఫిబ్రవరి 27న పరమాత్మ నా మొర ఆలకించాడు. ఆ రోజు సీఎం కేసీఆర్ సాబ్ టోలిచౌకి ఆదిత్యా ఎన్క్లేవ్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. పని ముగించుకుని కాన్వాయ్లో క్యాంప్ ఆఫీస్కు బయలుదేరారు. ఎలాగైనా సారును కలవాలని అనుకున్నాను. అన్ని కార్లలో సీఎం ఏ వాహనంలో ఉంటారో తెలియదు. అయినా సరే నా ప్రయత్నం ఆపలేదు. కాన్వాయ్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాను. సారు ఎలా చూశారో ఏమో. ఒక్క సారిగా కాన్వాయ్ ఆగిపోయింది. పోలీసులు పరుగులు తీశారు. నాకు భయం వేసింది. పక్కకి వెళ్లిపోదామంటే నా ఒంటి కాలు సహకరించలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. అక్కడే ఉండిపోయాను. అంతలోనే సీఎం సాబ్ కారు దిగి నా దగ్గరికి వచ్చారు. షేక్ హ్యాండ్ ఇస్తూ.. ‘ఏంటి నీ సమస్య’ అని అడిగారు. నా కష్టం చెప్పాను. అదే క్షణంలో అధికారులను పిలిపించి పింఛన్, ఇల్లు మంజూరు చేయించారు”
– బనాయ శ్రీనివాస్
రైతుల్లో రైతు
ఎమ్మెల్యేగా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండేవారు కేసీఆర్. ఆరోజు కూడా నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఒక గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఒక మహిళా రైతును పలుకరిస్తూ ‘ఏమవ్వా.. ఎట్ల నడుస్తాంది ఎవుసం?’ అన్నారు. ‘ఏం ఎవుసమో ఏమో పో సార్’ అన్నది. ఏదో దిగులుతో ఉందనే విషయం గ్రహించారు. ‘మీ కష్టాలేందో చెప్పుకోర్రి తల్లీ. అందుకే వచ్చినా’ అన్నారు. ‘ఏంజెప్పమంటరు సార్? పంట ఏసినకాన్నుంచి కోసేదాక నిక్రముంటలేదు. ఎప్పుడు వానొస్తదో, ఎప్పుడు పిడుగువడ్తదో అనే భయమే ఎక్కువైతాంది. రెండ్రోజులాయె. మొగులు కమ్మేసింది. పంటనేమో చేతికొచ్చింది. పోయినవారమే కోసేదుండె. తడారలేదని కొయ్యలేదు. నిన్నియాల కోద్దామంటెనేమో ఈ మొగులు పాడుగానూ ఒక్కటే నెత్తిల కూసున్నట్టే ఉంది’ అన్నది. ‘నేను కూడా రైతునే అవ్వా. మీ సమస్య నాకు తెలవదా? అది మీ ఒక్కరి సమస్యనే కాదు. ఊరందరి సమస్య. నియోజకవర్గం అందరి సమస్యా. సరే ఇప్పుడే ఏదో ఒకటిచేసి సమస్యను పరిష్కరిద్దాంలే’ అన్నారు. చాటింపేయించి గ్రామ రైతులందర్నీ పిలిపించారు. ‘అన్నా సూడుండ్రే. ఇది ఒక కొంరవ్వదో లేకపోతే నాదో నీదో కాదు. అందరి సమస్య. ఏంజేద్దామంటే అందరమూ యూనిట్గా ఏర్పడదాం. ఇయ్యాల ఒకరి పంట కోస్తే, రేపు ఇంకొకరిది కోద్దాం. అట్లా ఊరంతా కలిసికట్టుగా పంట గోస్తెనే ఈ వాన నుంచి బయటపడతం. ఆరుగాలం పడ్డ కష్టం ఫలిస్తుంది’ అన్నారు. కేసీఆర్ సలహాను పాటిస్తూ రైతులంతా కలిసి ఊర్లో పంటలన్నీ కోసి నష్టపోకుండా కాపాడుకున్నారు.
పెండ్లి కానుక
రాజకీయ నాయకులకు దాటవేత ధోరణి ఎక్కువ. కానీ, సీఎం కేసీఆర్ శైలి భిన్నమైంది. స్వతహాగా మనసున్న మనిషి కేసీఆర్. ఎదుటివారికి సాయం చేయడంతోనే ఆగిపోకుండా, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి శాశ్వత పరిష్కారం ఏమిటన్న కోణంలోనూ ఆలోచిస్తారు. నోరు తెరిచి అడగకున్నా… అవతలి వ్యక్తి కడుపులోని ఆపతిని కండ్లతోనే కనుక్కుంటారు. అడిగేందుకు మొహమాట పడేవారిని అదిలించి మరీ అవసరం తీరుస్తారు. ఆ ఉదాత్త గుణానికి ఎన్నో ఉదాహరణలు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2010 డిసెంబరు 16న వరంగల్ ప్రకాశ్రెడ్డి పేటలో భారీ బహిరంగసభ నిర్వహించారు. సభ ఏర్పాట్లకు అవసరమైన నిధుల సమీకరణ కోసం కూలీ పనిచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప్పల్, ఆలేరుతోపాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో స్వయంగా కేసీఆర్ కూలీ పనిచేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఓ రైసుమిల్లులో కూలీగా, వరంగల్ సీపీరెడ్డి కాంప్లెక్సులోని రెడిన్ కలర్ ల్యాబ్లో వర్కర్గా, చీర్స్ టైలర్స్ దుకాణంలో టైలర్గా, మహమ్మద్ ఖాన్ జువెలర్స్లో సేల్స్మెన్గా పనిచేశారు. కేసీఆర్ జువెలరీ షాపులో ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తల్లితో కలిసి పెండ్లి కోసం నెక్లెస్ కొనడానికి వచ్చింది. కేసీఆర్ చేతిలో పట్టుకున్న నెక్లెస్ వైపు ఆ యువతి తదేకంగా చూసింది. ఆమె మనసును పసిగట్టిన కేసీఆర్ వెంటనే ‘ఏమిటమ్మా… ఏం కొంటున్నావు’ అని అడిగారు. పెండ్లి నెక్లెస్ కొంటున్నానంటూ తన చేతిలో ఉన్న వేరే ఆభరణం చూపించింది. మరి ఎందుకమ్మా ముభావంగా ఉన్నావని అడిగారు కేసీఆర్. ఆ యువతి ఏమీ అనలేదు. ‘నీ దగ్గర ఉన్న నెక్లెస్ కంటే నా దగ్గర ఉన్నది బాగుంది. ఈ నెక్లెస్ నీకు బాగుంటుంది. ఇదే తీసుకో’ అన్నారు కేసీఆర్. ‘అది ధర ఎక్కువ సార్!’ అన్నది యువతి నిరాశగా. ఆడపిల్ల పెండ్లికోసం కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులు బాగా తెలిసిన కేసీఆర్ పెద్ద మనసుతో స్పందించారు. ‘నా దగ్గర ఉన్న నెక్లెస్ తీసుకో అమ్మా! దీని పైసలు మొత్తం నేనే ఇస్తా. నీ పెండ్లికి ఇది నా కానుక’ అని యువతి చేతికి ఆభరణం ఇచ్చారు. దాని ధర రూ.75 వేలు. ఆ మొత్తాన్ని కేసీఆర్ చెల్లించారు. ‘మీరు వచ్చిందే నిధుల సమీకరణ కోసం. ఇప్పుడు యువతికి నెక్లెస్ కొనిచ్చారెందుకు’ అని జర్నలిస్టులు అడిగితే… ‘ఆ పిల్ల నా బిడ్డ లెక్క అనిపించిందయ్యా. ఇచ్చిన’ అంటూ ముందుకు సాగారు.
‘కల్యాణ’ ఘడియ
ములుగు జిల్లాలోని ఓ తండా. పల్లెనిద్ర కార్యక్రమం కోసం కేసీఆర్ ఆ ఊర్ల్లో ఉన్నారు. బస్తీలన్నీ తిరుగుతూ ప్రజల సమస్యలు వింటున్నారు. ఒక దగ్గర జనాలంతా గుమిగూడి ఉండటం చూశారు. ఏదో ప్రమాదమే కావచ్చని గ్రహించారు. ‘ముందు అక్కడికెళ్దాం పదండి’ అని అధికారులను పురమాయించారు. వెళ్లేసరికి వాకిట్లో కూర్చొని బానోతు కీమానాయక్ అనే వ్యక్తి రోదిస్తున్నాడు. ఏం జరిగిందని ఆరాతీస్తూ అతణ్ని ఓదార్చారు కేసీఆర్. ‘రేపు లేదు ఎల్లుండే నా బిడ్డె కల్పన పెండ్లి సార్.. ఆ పనిమీదనే బైటికెళ్లినం. మల్లొచ్చేసరికి ఇల్లు తగులవడ్డది. ఏమైందో ఏమో తెలుస్తలేదు. పెండ్లి కోసమని దాసుకున్న పైసలు, సొమ్ములు, సరుకులన్నీ కాలి బూడిదైనయి’ అని ఏడ్వసాగాడు. ‘ఏం బాధపడకయ్యా. మీ కుటుంబానికి అండగా నేనున్నాను’ అని భరోసా కల్పించారు. పల్లెనిద్ర కార్యక్రమం ముగిసినా అవే దృశ్యాలు కండ్లముందు కనిపించేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి కష్టాలను తీర్చాలనుకున్నారు. ఆడబిడ్డల పెండ్లిల్లకు కానుక ఇచ్చి వారికి అండగా నిలవాలని తీర్మానించారు. అప్పుడెప్పుడో పల్లెనిద్రలో ఎదురైన అనుభవం నుంచి పుట్టుకొచ్చిన పథకమే.. ‘కల్యాణ లక్ష్మి’. ఈ పథకం ద్వారా అక్షరాలా లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు. ఇంతకుముందు ఆడబిడ్డ లగ్గం జరిగితే అందరూ సంతోషంగానే ఉన్నట్టు కనిపించేది కానీ, తల్లిదండ్రులకు మాత్రం లోలోపల దిగులే. సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుందా లేదా అనే భయం. ఇప్పుడిక, గుండెనిండా సంతోషమే!
తక్షణ స్పందన
ప్రజల సమస్యకు కేసీఆర్ తక్షణం స్పందిస్తారు. కరీంనగర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వేగురుపల్లి ఉంటుంది. ఇక్కడ వేగురుపల్లి – నీరుకుళ్ల వంతెన ఎంతో అవసరం. ఒక కిలోమీటరు పొడవు వంతెన వేస్తే ప్రజలకు 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సరుకు రవాణాకు కూడా ఎంతో ఉపయోగకరం. ఎంతమంది నాయకులకు చెప్పినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ వచ్చారు. మానకొండూర్ ఎమ్మెల్యే బాలకిషన్ ఈ వంతెన నిర్మాణం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కేసీఆర్ దాని ప్రాధాన్యాన్ని వెంటనే గ్రహించారు. అప్పటికప్పుడే ‘రసమయి గారు మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మీకు నేనిస్తున్న గిఫ్ట్… వేగురుపల్లి టు నీరుకుళ్ల బ్రిడ్జ్’ అంటూ అప్పటికప్పుడు రూ.200 కోట్లను మంజూరు చేశారు. ఇప్పుడు రామగుండం, గోదావరిఖని, పెద్దపల్లి నుంచి వరంగల్కు వెళ్లే వాహనాలన్నీ ఈ వంతెన మీది నుంచే పోతున్నాయి.
శాశ్వత పరిష్కారం
ఒకసారి హుస్నాబాద్లో సభ జరుగుతున్నది. కవ్వా లక్ష్మారెడ్డి అనే విశ్రాంత ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్ సీతారామారావు హుస్నాబాద్ నీటిపారుదల సమస్యలపై మాట్లాడదామని సభ దగ్గరికి వెళ్లారు. ‘కేసీఆర్ను కలవడమెట్లా?’ అని వేదికకు దగ్గరలో నిలబడి ఆలోచిస్తున్నారు. ఇద్దరినీ గమనించిన కేసీఆర్ తానే స్వయంగా వారి దగ్గరికి వచ్చారు. పనేమిటో అడిగి తెలుసుకున్నారు. మహా సముద్రం చెరువు గండి పూడ్చాలని కోరిన తక్షణమే నాలుగు కోట్లు కేటాయించారు. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి అడిగితే, అక్కడి నీటి సదుపాయం గురించే ఆలోచిస్తున్నా అన్నారు. మళ్లీ హుస్నాబాద్ పర్యటనకు ముందురోజు కవ్వా లక్ష్మారెడ్డిని పిలిపించుకొని ప్రగతిభవన్లో ఐదు గంటలపాటు గౌరవెల్లి ప్రాజెక్టు గురించి చర్చించారు. వారితోపాటు గౌరవెల్లి ప్రాజెక్టు ప్రాంతం, మహా సముద్రం చెరువును సందర్శించారు. ఇప్పుడు మహా సముద్రం గండి పూడ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తయింది.
హలో.. నేను కేసీఆర్!
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత పాలనా సంస్కృతి మారిపోయింది. ఎక్కడినుంచి ఏ విషయమైనా ఆయనే స్వయంగా తెలుసుకుంటారు. తన దగ్గరికి సమస్య ఏ రూపంలో వచ్చినా స్పందిస్తారు. ఒకసారి అర్హత గల లబ్ధిదారు పేరు అధికారులు, నాయకులు ఇచ్చిన జాబితాలో లేదు. కానీ గూఢచార వర్గాల ద్వారా కేసీఆర్ ఆ వ్యక్తి వివరాలు తెలుసుకున్నారు. నేరుగా ఆ వ్యక్తికి ఫోన్ చేసి అతని పేరును జాబితాలో చేర్పిస్తున్నట్టు తెలిపారు. ఒక యువరైతు భూ సమస్యను ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేశారు. నెలలు గడిచినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీంతో ఆ రైతు తన గోడును వెళ్లబోసుకుంటూ ఒక చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. వెంటనే స్వయంగా రైతు శరత్తో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.