తల్లి ఆరోగ్యంగా ఉంటేనే తన బిడ్డ బాగోగులు చూసుకోగలదు. మెరుగైన ఆరోగ్యానికి పోషకాహారం ఎంత అవసరమో, యోగాభ్యాసమూ అంతే ముఖ్యం. ఒక్కో ఆసనం ఒక్కో మేలు
చేస్తుంది. కాబోయే తల్లి వృక్షాసనం వేయగలిగితే కడుపులో శిశువు అమ్మచెట్టు నీడలో చల్లగా ఉన్నట్టే! అయితే, నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ ఆసనాన్ని ప్రయత్నించాలి.
ముందుగా నిటారుగా నిలబడాలి. పాదాలు దగ్గరగా ఉంచాలి. చేతులు స్వేచ్ఛగా వదిలేయాలి.
శ్వాస తీసుకుంటూ కుడిపాదాన్ని ఎడమకాలు పిక్క లేదా తొడకింద ఉంచాలి. నిదానంగా శ్వాస వదలాలి.
ఇప్పుడు మళ్లీ శ్వాస తీసుకుంటూ, రెండు చేతులనూ పైకెత్తి చిత్రంలో చూపినట్టు నమస్కారం చేయాలి. ఈ ఆసనంలో 20 సెకండ్లు ఉండాలి. ఈ సమయంలో శ్వాసక్రియ నిదానంగా సాగేలా చూసుకోవాలి. తర్వాత చేతులు కిందికి తెచ్చి, కుడికాలును దించేసి యథాస్థితికి రావాలి.
ఇప్పుడు ఎడమపాదాన్ని కుడికాలు తొడకింద ఉంచి, చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి. ఈ ఆసనంలోనూ 20 సెకండ్లు ఉండి తిరిగి సమస్థితికి చేరుకోవాలి.
వృక్షాసనం వల్ల వెన్నెముక బలపడుతుంది. ఛాతీ విశాలం అవుతుంది. భుజాల సత్తువ పెరుగుతుంది. కటి వలయం ఎముకలు ఓపెన్ అవుతాయి. పిక్కల కండరాలు దృఢమవుతాయి. కండ్లు తిరుగుతున్నా, తల తిరుగుతూ వాంతులు అవుతున్నట్టు అనిపించినా ఈ ఆసనం వేయకూడదు. వ్జైనానుంచి రక్తస్రావం అవుతున్న వాళ్లుకూడా ప్రయత్నించక పోవడం మంచిది.
నితా అత్యాల,
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109