హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో హ్యాండ్బాల్ క్రీడకు మరింత ఆదరణ పెరిగే దిశగా కీలక అడుగు పడింది. ప్రతిభ కల్గిన యువ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో హ్యాండ్బాల్కు చోటు లభించింది. అక్టోబర్లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2021లో హ్యాండ్బాల్ను క్రీడాంశంగా చేర్చుతున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐవోసీ, సాయ్, రాష్ట్ర క్రీడాశాఖకు జాతీయ హ్యాండ్బాల్ సమాఖ్య(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు కృతజ్ఞతలు తెలిపారు.