అనాథల కోసం సైకిల్ యాత్ర!

ఫుట్బాల్ వారి కల. ఆటలో ఆరితేరాలని ఆశ. కానీ వాళ్లు అనాథలు. సురభి ట్రస్ట్ ఆ పిల్లల బాగోగులు చూసుకుంటున్నది. ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనాలంటే డబ్బు కావాలి. అంత మొత్తం ఎవరు ఇస్తారు? ఆ క్రమంలో నేనున్నా అని ముందుకొచ్చాడొక వ్యక్తి. అతడే శశికిరణ్ తిరుమల.
హైదరాబాద్కు చెందిన శశికిరణ్ తిరుమల బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఫుట్బాల్ మైదానంలో మంచి నైపుణ్యం ఉన్న కొందరు విద్యార్థులను గమనించాడు. ‘ఇంతబాగా ఆడుతున్నారు.. టోర్నమెంట్లో పాల్గొనొచ్చు కదా’ అని అడిగాడు. ‘చాలా డబ్బులు కావాలి. అందుకే..’ అంటూ ఇబ్బందిగా జవాబిచ్చారు. శశి ఫుట్బాల్ అకాడమీ వాళ్లను సంప్రదించాడు. విషయం చెప్పాడు. ఫీజులో సగం వరకు తగ్గిస్తామనీ, మిగతా సగం మాత్రం కచ్చితంగా చెల్లించాల్సిందేననీ అన్నారు. దీంతో, సైకిల్ యాత్ర చేపట్టాడు. 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణం. బెంగళూరు నుంచి హైదరాబాద్, తిరిగి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్లాన్ వేసుకున్నాడు. గతేడాది కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టి రూ. 42,000 సేకరించాడు. మిగతా డబ్బు తన చేతి నుంచి కట్టాడు. ఇప్పుడు, మరింత మంది అనాథ విద్యార్థులను ఫుట్బాల్ టోర్నమెంట్కు పంపాలనే ఉద్దేశంతో సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నాడు. సాయం చేయాలనుకునేవాళ్లు 9885021421 నంబర్లో సంప్రదించవచ్చు.