హాలియా, మార్చి 27 : ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పడుతున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం చెరువులకు జవసత్వాలు నింపింది. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులన్నింటినీ పునరుద్ధరించింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 226చెరువులకు మోక్షం లభించింది. రూ.40కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరణ పనుల ఫలితంగా నీటి వనరులు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. వెరసి సాగునీటి రంగంలో గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది.
రూ.40కోట్లు ఖర్చు..
నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులన్నీ మరమ్మతుకు నోచుకున్నాయి. పూడిక తీయడంతో పాటు కట్టలు పునరుద్ధరించి తూములు నిర్మించారు. నాలుగు విడుతల్లో జరిగిన పనులకు రూ.40కో ట్లు ఖర్చు చేశా రు. మొదటి దశలో 75చెరువుల మరమ్మతులకు రూ.13.8కోట్లు, రెండో దశలో 83చెరువులకు రూ.16.9 కోట్లు, మూడో దశ, నాలుగో దశలో 68చెరువుల మరమ్మతులకు రూ.10కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 226చెరువులు కాగా, అనుముల మండలంలో 20, నిడమనూరులో 22, తిరుమలగిరి సాగర్లో 29, పెద్దవూరలో 48, గుర్రంపోడులో 81, త్రిపురారం మండలంలో 26చెరువులున్నాయి. ఆయా చెరువుల పరిధిలో 17,574ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్నది. నియోజకవర్గంలో చెరువుల కింద అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 4200ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అత్యల్పంగా త్రిపురారం మండలంలో 823 ఎకరాల్లో సాగవుతున్నది. అనుముల మండలంలో 2700 ఎకరాలు, నిడమనూరులో 1840 ఎకరాలు, తిరుమలగిరి సాగర్లో 2285, పెద్దవూర మండలంలో 2726ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంది.
చెరువు.. ఆదెరువు..
నిడమనూరు, మార్చి 27 : మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు సాగు, తాగు నీటి వరప్రదాయినిగా మారింది. 2013 అక్టోబర్ నెలలో తుఫాన్ కారణంగా చెరువుకు గండి పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకవడంతో చెరువులో చుక్క నీరు లేక సాగు, తాగు నీటికి ప్రజలు గోసపడ్డారు. 2014లో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గండి పూడ్చివేసి చెరువును పునరుద్ధరించింది. దీంతో ఆయకట్టులోని 700ఎకరాల్లో వరి సాగవుతుండగా శాఖాపురం గ్రామ శివారులోని బోర్లలో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. రెండు కార్లు వరి పండిస్తూ రైతులు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
నాడు 30ఎకరాలు.. నేడు 250
గుర్రంపోడు, మార్చి 27 : మండలంలోని కొప్పోలు గ్రామంలో తాటి చెరువు కింద గతంలో 30ఎకరాలు మాత్రమే సాగయ్యేది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీసి పునరుద్ధరించడంతో వేసవిలోనూ నిండుకుండను తలపిస్తున్నది. ప్రస్తుతం తాటి చెరువు కింద 250 ఎకరాల్లో వరి సాగవుతున్నది. గతంలో పశువులకు కూడా నీరు దొరికేది కాదు. కానీ, నేడు రెండు పంటలకు నీరందుతుండడంతో రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
సాగునీరందిస్తున్న ఘనత టీఆర్ఎస్దే..
గత పాలకులు చెరువులను పట్టించుకోకపోవడంతో అన్నీ పూడుకుపోయి ఆనవాళ్లు కోల్పోయాయి. టీఆర్ఎస్ పాలనలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల మహర్దశ పట్టింది. ఎండాకాలంలో కూడా నిండా నీళ్లతోని చెరువులు కళకళలాడుతున్నాయి. సాగు నీటికి ఢోకా లేదు. రెండు కార్లు వరి పండుతున్నది. సాగునీరందిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కారుదే.
కబ్జా చెర నుంచి విముక్తి
30ఏండ్లుగా చుక్క నీరు లేక ఏటా కబ్జాకు గురవుతూ వచ్చిన త్రిపురారం చెరువుకు టీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోసింది. మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధరించడంతో 2018 సంవత్సరం నుంచి నిండా నీళ్లతో కళకళలాడుతున్నది. చెరువు కింద 150ఎకరాల భూమిలో వరి పండుతున్నది. చెరువు ఆక్రమణకు గురై తమ భూములు ఇక అమ్ముకోక తప్పదనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం మా కుటుంబాల్లో వెలుగులు నింపిందని రైతులు పేర్కొంటున్నారు. నీలి విప్లవం ద్వారా చేప పిల్లలు పెంచి తమకు ఉపాధి కల్పించిన కేసీఆర్ సారు రుణం తీర్చుకోలేనిదని మత్స్యకారులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
కరువు నేలపై.. జలదృశ్యం
‘ఫాంపాండ్స్’.. సాగర్ ఆయకట్టులో ఈ పేరు తెలియని రైతులు ఉండరు. ఐదేండ్ల కిందట భూగర్భ జలాలు అడుగంటి, విద్యుత్ కోతలు పెరిగిపోయిన సమయంలో రైతులకు ఇవి పరిచయమయ్యాయి. ముఖ్యంగా దామరచర్ల మండలంలో ఎంతో మంది అప్పట్లో వీటిని నిర్మించుకున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో కరువు కరాళ నృత్యం చేసింది. కరెంటు ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి. రాత్రి వేళల్లో పొలంవద్దనే పడుకొని కరెంటు వచ్చినప్పుడు పంటలు తడుపుకున్న క్రమంలో రైతులు విద్యుత్ తీగలు తాకి, పాముకాట్లకు గురై మృత్యువాత పడేవారు. ఇక బత్తాయి తోటలు వేసిన రైతులు చెట్లను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందించేవారు. ఈ క్రమంలోనే ఫాంపాండ్స్ నిర్మించుకొని నీటిని నిల్వ చేసుకొని ఆయిల్ ఇంజన్ల ద్వారా ఉపయోగించుకునేవారు. పత్తి, మిర్చి పంటవేసిన సన్న, చిన్న కారు రైతులు ఎడ్లబండ్ల మీద ట్యాంకులు పెట్టుకొని నీటిని తోలుకొని పంటను తడుపుకున్నారు. బోర్ల మీద ఆధారపడ్డ రైతులు ఓ వైపు భూగర్భజలాలు లేక, మరోవైపు లో ఓల్టేజీ కారణంగా తరచూ మోటర్లు కాలిపోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 24గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుండగా మరోవైపు మిషన్ కాకతీయతో చెరువులు పూడిక తీయించారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుండడంతో బోర్లు ఉధృతంగా పోస్తున్నాయి. ఓ వైపు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా చెరువులు నింపగా.. ఇంకోవైపు రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు అందించడం వల్ల ఆరేండ్లలో సాగు పండుగలా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో కరువును జయించిన రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు.