ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప గుడికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పూజలూ ప్రత్యేకమే. రుద్రేశ్వరుడి అర్చన కోసం ఆలయ ఉద్యానవనంలో పూసే నాగలింగ పుష్పాలను వినియోగిస్తారు. ఇక్కడ మూడు నాగలింగ వృక్షాలున్నాయి. శివపూజకు బిల్వం, తుమ్మి, మందార, రేల, తామర, శంఖ, నాగలింగ పుష్పాలను వాడాలని పద్మపురాణం చెబుతున్నది. ఒక నాగలింగ మొక్క నాటితే వెయ్యి శివలింగాలు ప్రతిష్ఠించినంత ఫలమని అంటారు. నాగలింగ శాస్త్రీయనామం.. కోరోపీటా గైనేన్సిస్. ఇదో అరుదైన జాతి. ఈ చెట్లు 30 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చాలాకాలం క్రితం, భారత పురావస్తుశాఖ ఉద్యాన విభాగం అధికారులు రామప్ప ఆలయ ఆవరణలో నాగలింగ మొక్కను నాటారు. వాటిని మైసూరు నుంచి ప్రత్యేకంగా తెచ్చారు. నాగలింగ పుష్పాలు చెట్టు కాండానికి పూస్తాయి. ఆకులున్న చోట పూలు ఉండవు. నాగలింగ పుష్పం లోపలిభాగం శివలింగాకారంలో ఉంటుంది. ఇక చెట్టయితే.. చెట్టంత దేవుడైన శివుడి జటాఝూటాన్ని గుర్తుకు తెస్తుంది. ‘ఈ వృక్షాన్ని శివుడి అంశగా భావిస్తారు. చెప్పులు ధరించి చెట్టును తాకరు. ఆకులూ కొమ్మలూ వైద్యపరంగానూ ఉపయోగపడుతాయి. ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో వాడతారు’ అని చెబుతారు రామప్ప గుడి ప్రధాన అర్చకులు కోమల్లపల్లి హరీశ్ శర్మ.