న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో బుధవారం వరకు 1,044 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, 89 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ నుంచి 92 మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరత ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక బుధవారం ఢిల్లీలో 576 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. పాజిటివిటీ రేటు 0.78 శాతంగా ఉంది.