అమరావతి : విశాఖపట్నం నగరంతో పాటు ఉత్తరాంధ్రలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని విశాఖపట్నం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను పూర్తి కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో ఇప్పటికే 200 ఆక్సిజన్ పడకలు, 200 ఐసీయూ పడకలు అందుబాటులో ఉండగా మరో 200 ఐసీయూ పడకలు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. సీనియర్ వైద్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వారి బంధువులు నేరుగా వైద్యుల నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రస్తుతం 132 మంది వైద్యులు, 212 నర్సులు, 300 మంది పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది ఆస్పత్రిలో విధుల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.