హనుమకొండ, ఆగస్టు 26 : పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వీప్ ఓటరు నమోదు, ఓటు హకు, ఈవీఎంల వినియోగంపై జిల్లాలోని వివిధ కళాశాలల యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అలాగే, కచ్చితంగా ఓటు హకును వినియోగించుకోవాలన్నారు. ప్రత్యేక క్యాంపెయిన్లో భాగంగా ఈ నెల 26, 27 సెప్టెంబర్ 2,3 తేదీల్లో అన్ని పోలింగ్ స్టేషన్లలో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఓటరు జాబితాలో సవరణలు ఉన్నా చేసుకోవచ్చన్నారు. అనంతరం యువతతో ఈవీఎంలపై ఓటు వేయించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, పరిశ్రమల శాఖ జీఎం హరిప్రసాద్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఆర్ట్స్ కాలేజీ పోలింగ్ కేంద్రం సందర్శన
ఓటరు నమోదు సవరణ స్పెషల్ క్యాంపెయిన్లో భాగంగా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బీఎల్వోలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.
ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలి
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 2వ ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు ఇచ్చారు. జిల్లా నుంచి కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు శిబిరాలను నిర్వహించేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో జనాభా నిష్పత్తి ప్రకారం ఓటరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు జాబితాలో తొలగించిన ఓటర్ల వివరాలను పునఃపరిశీలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో స్విప్ నోడల్ అధికారి హరిప్రసాద్, ఆర్డీవోలు రమేశ్ కుమార్, శ్రీనివాస్, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.