ఏటూరునాగారం, మార్చి 30 : వేధింపులు భరించలేక వ్యక్తి చేతులు కట్టేసి కత్తితో పొడిచి ఓ యువతి దారుణ హత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి మండలకేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో మండలకేంద్రంలోని మూడవ వార్డులో అమ్మమ్మ ఇంట్లో ఉండి జీవనం కొనసాగిస్తున్న జాడి సంగీతను అంబేద్కర్ నగర్కు చెందిన రాంటెంకి శ్రీనివాస్(32) కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు. శ్రీనివాస్ భార్య కొన్నేండ్ల క్రితం వదిలేసి తల్లిగారింటికి వెళ్లింది. గతంలో వీరిద్దరూ స్నేహితులు. కలిసి గుడుంబా వ్యాపారం కూడా చేశారు. ఏడాదిగా సంగీత ఇతడితో మాట్లాడడం లేదు. తరచూ సంగీత ఇంటికి రాత్రి వేళ వచ్చి తలుపు కొట్టేవాడు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో కూడా మద్యం మత్తులో తలుపులు తట్టి తెరవాలని గొడవ చేశాడు. తలుపులు తెరవకపోవడంతో తిరిగి వెళ్లిపోయిన శ్రీనివాస్ రాత్రి 12 గంటల తర్వాత మళ్లీ వచ్చాడు. దీంతో తలుపులు తెరిచిన సంగీత శ్రీనివాస్ను ఇంట్లోకి తీసుకెళ్లి దోమ తెర వైరుతో చేతులు కట్టేసి బయటకు తీసుకు వచ్చి గుంజకు బంధించి కత్తితో నాలుగైదు సార్లు కడుపులో పొడిచింది. దీంతో అక్కడికక్కడే శ్రీనివాస్ చనిపోయాడు. కొద్ది సేపటి తర్వాత నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి సంగీత లొంగిపోయింది. కాగా, చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి కోర్టుకు పంపించినట్లు సీఐ రాజు తెలిపారు.
సంగీత తల్లి సమ్మక్క అంబేద్కర్ నగర్కు చెందిన జాడి కొంరయ్యను ప్రేమ వివాహం చేసుకుంది. కాగా, తల్లిదండ్రులు సమ్మక్క, కొంరయ్య ఇద్దరూ చనిపోవడంతో ఒంటరైన సంగీత ఎర్రల వీధిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చిరు వ్యాపారం, కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నది. శ్రీనివాస్ వేధింపులు భరించలేక గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ను రిమాండ్కు పంపించారు. నెల రోజుల క్రితం జైలు నుంచి వచ్చిన శ్రీనివాస్ మళ్లీ సంగీతను వెంబడించడం రాత్రి వేళ ఇంటికి వచ్చి మానసికంగా ఇబ్బంది పెట్టడం చేస్తున్న తీరు హత్యకు దారి తీసింది. కాగా, బుధవారం రాత్రి కూడా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న క్రమంలో శ్రీనివాస్ను కట్టేసి కత్తితో పొడిచి చంపింది. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.