హనుమకొండ, మార్చి 3: ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యగా పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శ్రీరామచంద్ర మిషన్, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించే యోగా మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నందున శరీరానికి యోగా అవసరమన్నారు. మారిన దృష్ట్యా తీసుకునే ఆహారంలో మార్పులు జరగడం, శారీరక శ్రమ తగ్గడం అనేక రోగాలు వస్తున్నాయని తెలిపారు. అందుకే యోగాను దినచర్యగా పాటించాలన్నారు. పదేళ్లుగా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న తన కూతురు ప్రీతి కోరిక మేరకు ఇక్కడ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్లోని శాంతివనంలో శిక్షణ పొందిన విదేశీయులు తమ దేశాల్లో అవుతున్నారన్నారు. యోగా కేంద్రానికి తన స్వగ్రామం పర్వతగిరి పక్కనున్న కల్లెడ సమీపంలో తమ ట్రస్ట్కు చెందిన 200 ఎకరాలను అప్పగించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ యోగా, ధ్యానంతో ఒత్తిడి దూరం అవుతుందన్నారు. యోగాపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
యోగా ప్రపంచ వ్యాప్తం..
యోగా అంటే కేవలం ఆసనాలే కాదని, గొప్ప జీవ విధానమని ప్రఖ్యాత గురువు, శ్రీరామచంద్ర మిషన్ దాజి అన్నారు. యోగాను ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నారని తెలిపారు. ధ్యానంతో మనసు ప్రశాంతత, ఆత్మీయత పెరుగుతుందని, దీంతో మనలోని ఆక్రోశం, ఆవేశం వంటివి నివారించబడుతుందని వివరించారు. ప్రాణాయామంతో శరీరం దృఢంగా మారుతుందన్నారు. అంతకుముందు భూషణ్ భుక్తి యోగా శిక్షకుడు యోగాసనాలను ప్రదర్శించారు. చిన్నారులతో భైటీ మెస్ ప్రోగ్రాం నిర్వహించారు. వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపిచంద్ యోగా గురించి తెలియజేశారు. మంత్రి ఎర్రబెల్లి దాజీని శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ సుధారాణి, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, కమిషనర్ ప్రావీణ్య, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో వీ జగదీశ్వర్, కేయూ ఉపకులపతి రమేశ్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ బన్న అయిలయ్య హాజరయ్యారు.