గణపురం, మార్చి 8 : సీతారాంపురం గ్రామస్తులు శుక్రవారం తాగునీటి కోసం ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాంపురం గ్రామం హరిజనవాడకు రెండు నెలల నుంచి తాగునీరు అందడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పైపులైన్ల ద్వారా వచ్చే అరకొర నీళ్లు దేనికి సరిపోవడం లేదన్నారు. అప్పుడప్పుడూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ఒక కుటుంబానికి ఒక్కటి, రెండు బిందెలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు.
రెండు నెలలుగా పంచాయతీ అధికారులు కాలనీలోకి ట్యాంకర్లను సైతం పంపించడం లేదని వాపోయారు. తమ కాలనీకి నీరందడం లేదని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడే పాలకులకు తాము గుర్తుకు వస్తామని నేడు తమ గోడును పట్టించుకున్న నాయకుడు లేడన్నారు. ఇప్పటికైనా తమ కాలనీకి నీరందించాలని కోరారు.