హనుమకొండ, జనవరి 20 : ప్రతి మహిళా సమాఖ్య రైతులకు తోడ్పాటు అందించాలని సెర్ప్ డైరెక్టర్ ఎన్ రజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్కుమార్ అధ్యక్షతన రైతులకు వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాలు, ఆహార శుద్ధి కేంద్రాల(పీఎంఎఫ్ఎంఈ)పై ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల డీపీఎం, ఏపీఎం, ఎంఎస్ఏలకు ఒక రోజు వర్క్షాపు (శిక్షణ) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా జిల్లాల్లోని ప్రతి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రైతులకు పనిముట్ల అద్దె కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పంట ఉత్పత్తులను ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ (ఎఫ్పీసీ)ల ద్వారా కొనుగోలు చేయడంతో పాటు ఆహార పరిశ్రమల ఏర్పాటుకు మహిళా సంఘాలు ముందుకు రావాలని పేర్కొన్నారు. వీరికి 35 శాతం సబ్సిడీ పొందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ఎంఎస్ఏలకు అకౌంట్స్ బుక్ అప్డేట్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీపీఎంలు శ్రీకాంత్, సరిత, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.