వరంగల్ చౌరస్తా: బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రైలు ప్రయాణిస్తున్న అర అంజుం (27) మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లుగా మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో 108 సిబ్బందికి సమాచారం అందింది.
వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పైలట్ అమర్ను వెంటపెట్టుకుని108 సిబ్బంది రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు ఆపిన తర్వాత గర్భిణి పరిస్థితి గమనించిన సిబ్బంది అక్కడే ప్రసవం చేశారు.
కాగా, ఆర అంజుంకు ఇది నాలుగో ప్రసవమని కుటుంబసభ్యులు తెలిపారు. రైలులోనే ప్రసవం చేసిన 108 సిబ్బందిని రైల్వే అధికారులు, ప్రయాణికులు అభినందించారు. ప్రసవం అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం బాలింతను సీకేఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.