కాజీపేట, డిసెంబర్ 18 : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తపై ప్రతీకారంతో మొదటి భార్య మరో ముగ్గురితో కలిసి హత్య చేయించిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో భార్యతోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం కాజీపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్కు చెందిన జన్నారపు వేణుకుమార్(34) గిరిగిరి చిట్టీలు నడుపుతూ కాజీపేట డీజీల్ కాలనీ రైల్వే క్వార్టర్స్లో ఉండేవాడు. ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జన్నారపు సుష్మితకు ఇద్దరు కుమార్తెలు. ఆమె కాజీపేట లోకోషెడ్లో టెక్నీషియన్-1 గా విధులు నిర్వర్తిస్తుంది.
రెండో భార్య సంతోష ఇంటి వద్దనే ఉంటుండగా, ఆమెకు కుమారుడు ఉన్నాడు. ఈ నేపథ్యంలో వేణుకుమార్ మహబూబాబాద్కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఇద్దరు భార్యలను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. దీంతో విసుగెత్తిన మొదటి భార్య సుష్మిత తన భర్త వేణుకుమార్కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని సమీప బంధువైన కొంగర అనిల్కు విషయం చెప్పింది. కొంగర అనిల్ తనకు పరిచయమున్న గడ్డం రత్నాకర్, కటిక నవీన్తో కలిసి వేణుకుమార్ను హత్య చేసేందుకు పథకం రూపొందించారు. ఇందుకోసం సుష్మితతో రూ.4 లక్షలకు డీల్ కుదుర్చుకుని ఇందులో రూ.2 లక్షలు అడ్వాస్గా తీసుకున్నారు. పథకం ప్రకారం గత సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి సమయంలో సుష్మిత తన భర్త వేణుకుమార్కు పాయసంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. పాయసం తాగిన వేణుకుమార్ అపస్మారక స్థితిలోకి చేరుకోగానే అనిల్కు సమాచారం అందించింది. కొద్దిసేపట్లోనే అనిల్, రత్నాకర్ డీజిల్ కాలనీలోని సుష్మిత ఉంటున్న రైల్వే క్వార్టర్స్కు వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న వేణుకుమార్ను కారు వెనుక సీటులో వేసుకుని పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోకి వెళ్లి అక్కడి మానేరు వాగులో పడేశారు. వీరికి కటిక నవీన్ సహకరించాడు. వేణుకుమార్ మృతి చెందడంతో అక్టోబర్ 1న మానేరు వాగులో గుర్తు తెలియని శవం ఉన్నట్లు పోలీసులు కనుగొని కేసు నమోదు చేశారు. అనంతరం శవాన్ని పూడ్చిపెట్టారు.
నలుగురిపై కేసు నమోదు
వేణుకుమార్ను హతమార్చిన ఘటనలో నిందితులు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ అశోక్కుమార్ తెలిపారు. ఏ1గా జన్నారపు సుష్మిత( రైల్వే ఉద్యోగి కాజీపేట), ఏ2గా కొంగర అనిల్(ఫొటోగ్రాఫర్ నెక్కొండ. ప్రస్తుతం సికింద్రాబాద్లో), ఏ3గా గడ్డం రత్నాకర్, వడ్డేపల్లి(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి), ఏ4 గా కటిక నవీన్(కారు డ్రైవర్, జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ అశోక్కుమార్ వెల్లడించారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్ల్ను సీజ్ చేశామన్నారు. నిందితుడు గడ్డం రత్నాకర్కు గతంలో రెండు మర్డర్ కేసుల్లో సంబంధం ఉందన్నారు. జయశంకర్ జిల్లాలో రౌడీషీట్ ఉందని, త్వరలోనే పీడీ యార్టు కేసు నమోదు చేస్తామన్నారు. హత్య కేసును 70 రోజుల్లో చేధించిన కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సైలు ప్రమోద్కుమార్, రవికుమార్, వెంకటేశ్వర్లు, ఏఎస్సై సల్మాన్ పాషా, పీసీలు భాస్కర్, మధు, శ్రీనివాస్, వేణు, సతీశ్రెడ్డి, రమేశ్ను సీపీ అభినందించారు.
తనపై అనుమానం రాకుండా..
తనపై ఎవరికీ అనుమానం కలుగకుండా తన భర్త కనిపించడం లేదని జన్నారపు సుష్మిత కాజీపేట పోలీస్ స్టేషన్ల్లో అక్టోబర్ 7న ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఎక్కడా వారికి సరైన క్లూ లభించకపోవడంతో సుష్మితను అనుమానించి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా వాస్తవం వెలుగు చూసింది. సుష్మిత నేరాన్ని అంగీకరించి సరెండర్ అ యింది. నిందితురాలి వాంగ్మూలం ఆధారంగా మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మంథని పోలీసుల సహకారంతో మృతదేహాన్ని వెలికి తీశారు. స్థానిక తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహిం చి మృ తదేహాన్ని బంధువులకు అప్పగించారు.