వరంగల్ : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తున్న హామీలకు మోసపోయి ఓటేస్లే గోసపడతామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వనిది తెలంగాణలో ఇస్తారా ? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని సూచించారు. బుధవారం తొర్రురులో నిర్వహించిన గిరిజన సమన్వయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి , రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రావు (Minister Dayakar Rao) తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణలో గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్( CM KCR) అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు. కనీసం త్రీ ఫేజ్ కరెంట్ కనెక్షన్లు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. గిరిజనులకే పాలనాధికారం అప్పగించిన గొప్పనాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు.
రూ. 600 కోట్లతో ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లను నిర్మించుకున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 700 మించి పెన్షన్ ఇవ్వలేని వారు తెలంగాణలో రూ. 4 వేలు ఇస్తాననడం ప్రజలను మోసం చేయడమే నని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూయించి అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని నమ్మవద్దని కోరారు. ‘కేసీఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం. లేదంటే అందరం బాధ పడతామని ‘ అన్నారు.