రఘునాథపల్లి, డిసెంబర్ 19: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్ రఘునాథపల్లి, లింగాలఘనపురం మండలాల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం యశ్వంతాపూర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై గ్రామాల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆరు గ్యారంటీలకు డిసెంబర్ 9న చట్టబద్దత కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పారని గుర్తు చేశారు. రైతుల పంట రుణాలు రూ.2 లక్షలను మాఫీ చేస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ. 2500, వంటగ్యాస్ రూ.500కే ఇస్తామని చెప్పారని తెలిపారు. వీటిలో కేవలం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేశారని శ్రీహరి వివరించారు. రైతులకు నేటికీ రైతుబంధు సాయం అందలేదని, ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారన్నారు.
ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య ఖర్చులకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రూ.5 నుంచి రూ.10 లక్షలు ఇస్తామని ఆనాడే చెప్పామని, ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదన్నారు. హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పాలకులు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ర్టాన్ని అప్పులమయం చేశారని ఆరోపించడం సరికాదన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తించకుండా అసత్యాలు చెబుతూ శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటున్నారని శ్రీహరి తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు గుడి వంశ్రీధర్రెడ్డి, బొల్లం అజయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వారాల రమేశ్యాదవ్, బస్వగాని శ్రీనివాస్, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు మారుజోడు రాంబాబు, నాయకులు లోనె శ్రవణ్కుమార్, నామాల బుచ్చయ్య, గొరిగె రవి, బొల్లంపల్లి నాగేందర్, మడ్లపల్లి సునీత, ఉడుగుల భాగ్య, మాజీ ఎంపీపీ దాసరి అనిత, దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.