ఐనవోలు, మే 28 : పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని 44వ డివిజన్ జోగయ్యపల్లి, సింగారం గ్రామాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ.4లక్షల 464 విలువైన చెక్కులను కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి నేరుగా చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద రూ.లక్షా 116 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలుస్తుందన్నారు. కాగా, 44వ డివిజన్ సింగారం గ్రామానికి చెందిన కోడి కుమారస్వామి, సింగారపు కనకయ్య, రాధ, సుక్కమ్మ, సుధాకర్, పోచమ్మ, ఈదురు లక్ష్మి, బీళ్ల ఆగయ్య, తాడెం పుల్లయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. సొసైటీ అధ్యక్షుడు, డివిజన్ ప్రెసిడెంట్ జయపాల్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొలెపల్లి శంకర్రెడ్డి, సంపత్రెడ్డి, సింగారపు పుల్లయ్య, రాజు, కుమారస్వామి పాల్గొన్నారు.