ములుగు, మే 29 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారులు చెరువుల తూము షటర్లు ఎత్తకుండా నీటి పారుదల శాఖ నుంచి నిఘా ఏర్పాటు చేస్తామని ఆ శాఖ ములుగు డీఈ రవీందర్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘నమస్తే’లో ‘చేపల కోసం చెరువు ఖాళీ’ కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. బుధవారం డీఈ, ఏఈ లోకం చెరువు వద్దకు వచ్చి తూము, షటర్లు, చెరువును పరిశీలించారు. లోకం చెరువు ములుగు ఇరిగేషన్ డివిజన్ నంబర్-4 నిర్వహణలో ఉందని, చెరువు కింద 1,347ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడి ఉందని డీఈ తెలిపారు. యాసంగి పంటకు నీటి లభ్యతను బట్టి 150 ఎకరాలకు నీటిని విడుదల చేశామన్నారు. సీజన్ పూర్తయినందున తూము ద్వారా నీరు వెళ్లకుండా నిలిపివేశామని తెలిపారు. తూము షటర్ తుప్పు పట్టి రంధ్రం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పైఅధికారులకు పంపించినట్లు తెలిపారు. చేపలు పోసిన కాంట్రాక్టర్ ఒక వేళ రాత్రి వేళలో దొంగతనంగా తూము షటర్ ఎత్తితే క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని రవీందర్రెడ్డి పేర్కొన్నారు.