మడికొండ ఐటీ పార్క్లో సోమవారం జరిగిన కొలువు జాతరకు యువత పోటెత్తింది. ఇక్కడి క్వాడ్రంట్ ఐటీ సొల్యూషన్స్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాలో 36 కంపెనీలు పాల్గొని సుమారు 1500 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వివిధ జిల్లాల నుంచి సుమారు 10వేల మంది ఉద్యోగార్థులు తరలివచ్చారు. మేళాను వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి ప్రారంభించారు. మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చిందని, 6800మందిని ఇంటర్వ్యూ చేశామని, త్వరలో మరిన్ని మేళాలు నిర్వహిస్తామని క్వాడ్రంట్ సీఈవో వంశీరెడ్డి తెలిపారు.
– మడికొండ, డిసెంబర్ 18
మడికొండలోని ఐటీ పార్లో క్వాడ్రంట్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీలో సోమవారం మెగా జాబ్మేళా నిర్వహించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మేళాలో 36 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 1500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో టెక్ మహీంద్ర 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. 2021 నుంచి 2024 వరకు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులను మాత్రమే ఎంపిక చేశారు. కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హాజరై మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్వాడ్రంట్ ఐటీ కంపెనీ సీఈవో వంశీరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ కష్టపడి చదివి ఐటీ సంస్థలు స్థాపించాలని సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్కార్డ్స్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరిన్ని ఐటీ కంపెనీలకు ప్రభుత్వ స్థలం కేటాయించనున్నదని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లోనే కాకుండా వరంగల్లోనూ ఐటీ కంపెనీలు జాబ్స్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సీఈవో కంచరకుంట్ల వంశీరెడ్డి మాట్లాడుతూ మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చిందన్నారు. వివిధ జిల్లాల నుంచి ఆన్లైన్ ద్వారా 15,895 దరఖాస్తు చేసుకోగా 6800 మందిని ఇంటర్వ్యూలకు పిలిచినట్లు చెప్పారు. అన్ని కంపెనీల్లో కలిపి 1200 నుంచి 1600 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే సుమారు పది వేల వరకు అభ్యర్థులు హాజరయ్యారని, త్వరలోనే మరిన్ని కంపెనీలతో మాట్లాడి జాబ్మేళా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్వాడ్రంట్ సంస్థ ఎండీ కంచరకుంట్ల మురళీధర్రెడ్డి, వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొన్నారు.