వరంగల్, మార్చి 12: ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కలిసి ఆయన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల పురోగతి, భద్రకాళీ ఆలయ మాడవీధుల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరంగల్లోని భద్రకాళీ ఆలయ అభివృద్ధి, మాడవీధుల పనులను ఆగమశాస్త్ర ప్రకారం చేపట్టాలని సూచించారు. మాడవీధుల నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరయ్యాయని, అందులో రూ.20కోట్లు ఎస్డీఎఫ్, రూ.10కోట్లు కుడా సమకూర్చుతున్నట్లు చెప్పారు. భద్రకాళీ ఆలయానికి 9వ అంతస్తులో రాజగోపురం నిర్మించనున్నట్లు వెల్లడించారు. భద్రకాళీ అమ్మవారి ఊరేగింపు కోసం మాడవీధులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆలయం చుట్టూ రాతి బేస్మెంట్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషిచేసిన కాళోజీ నారాయణరావు పేర కళాక్షేత్రం నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రులు సురేఖ, సీతక్క అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పనుల కంటే ఎక్కువ మొత్తంలో బిల్లులు మంజూరుపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. అలాగే నగరంలోని స్మార్ట్సిటీ, ఇతర పథకాల ద్వారా కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో సమీక్షించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిశోర్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యదర్శి అనిల్కుమార్, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, కుడా ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, బల్దియా ఎస్ఈ ప్రవీణ్చంద్ర, కుడా ఈఈ భీంరావు పాల్గొన్నారు.