నయీంనగర్, మార్చి 11 : దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదంపై యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ‘బీసీ అస్తిత్వ సాహిత్యం-సమాలోచన’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును తెలుగు విభాగాధిపతి పంతంగి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం సెనేట్హాల్లో నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదకారిగా మారిన మతోన్మాదాన్ని రూపుమాపేందుకు కవులు, కళాకారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. తెలంగాణలోని గంగాజమునా తెహజీబ్ సంస్కృతికి ప్రమాదకరంగా మతోన్మాద ధోరణి ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు గొప్ప ప్రోత్సాహం ఉందని, సిలబస్లో బీసీ సాహిత్యం ఉండడం అభినందనీయమని అన్నారు. బీసీలు లేకుంటే సాహిత్యమే లేదని, సమాజ నిర్మాణంలో బీసీ సాహిత్యం గొప్ప భూమిక పోషించిందని వివరించారు. బీసీ వాదం తెరమీదకు రావాలని అన్నారు. మహాత్మా జ్యోతిరావుఫూలే ఆశయాలను సాకారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పారు. గురుకులాల ఏర్పాటుతో రాష్ట్రంలో ఏటా ఐదు లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని చెప్పారు. ఫూలే దంపతులు చిరస్మరణీయులు అని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయాలు సర్వ వాదాలకు వేదిక కావాలని వీసీ టీ రమేశ్ అన్నారు. సాహిత్యం హేతుబద్ధమైన పరిష్కార మార్గం చూపాలని, కులం ఆధారంగా మనిషి విలువ నిర్ణయించ కూడదని చెప్పారు. ప్రతిభ ఏ ఒక్కరి సొత్తుకాదని. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు పోవాలని ఆయన సూచించారు. సదస్సులో ప్రముఖ నవలా రచయిత వీఆర్ రాసాని, ప్రముఖ విమర్శకులు, సాహితీవేత్త లక్ష్మీనారాయణ, పాలక మండలి సభ్యులు సీతారాం, మొవ్వ శ్రీనివాసరావు, ఏటూరి జ్యోతి, కిషన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.