ఖిలావరంగల్, మార్చి 28 : ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో భాగంగా 103.86శాతంతో ప్రాధాన్యతా రంగాలకు రూ.2672.44 కోట్ల రుణాలు మంజూరు చేశామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రెడిట్ డిపాజిట్ 119.20 శాతం ఉందన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో 67 యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు. వీటిని ఇంకా పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. పీఎంఎఫ్ఎంఈ ద్వారా ఇప్పటి వరకు 24 యూనిట్లు మంజూరు చేశామని, పెండింగ్లో ఉన్న 51 యూనిట్లను త్వరగా మంజూరు చేయాలన్నారు.
ముద్ర రుణాలు 11,760 యూనిట్లకు రూ.107.13 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. బ్యాంకర్లు క్రాప్ రుణాల విషయంలో రైతులకు సహకరిస్తున్నారన్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి రుణాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఎల్డీఎం రాజు మాట్లాడుతూ.. స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.568 కోట్లకు గాను రూ.439 కోట్లు, ఎడ్యుకేషన్ లోన్ల కింద రూ.20.04 కోట్లు మంజూరు చేశామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పశు సంవర్ధక శాఖ రుణాల కోసం 2,427 దరఖాస్తులు రాగా, 962 మంది రైతులకు మంజూరు చేశామని చెప్పారు. సమావేశం అనంతరం హనుమకొండ, వరంగల్లోని సెంట్రల్ లైబ్రరీతో పాటు తొమ్మిది గ్రామీణ లైబ్రరీలకు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు లీడ్ బ్యాంక్ అధికారి రాజు ఆధ్వర్యంలో రూ.87,800 విరాళం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్లు సత్యం, మాధవి, శ్రీధర్రెడ్డి, రవి, అనిల్కుమార్ పాల్గొన్నారు.
మహిళా ఆరోగ్య కేంద్రం తనిఖీ..
గీసుగొండ : గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీలో మహిళా ఆరోగ్య కేంద్రాన్నికలెక్టర్ ప్రావీణ్య తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా 5 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మహిళలు ప్రతి మంగళవారం కేంద్రాలకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కేంద్రాల్లో అందుబాటులో లేని వైద్య సేవల కోసం వైద్యాధికారులు జిల్లా దవాఖానలకు రెఫర్ చేస్తారన్నారు. వైద్యాధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటరమణ, వైద్యాధికారి మాధవీలత పాల్గొన్నారు.