హనుమకొండ, మే 26 : భానుడి భగభగలకు మనుషులే కాదు.. కరెంట్ ఇచ్చే మిషన్లు కూడా విలవిల్లాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 46 నుంచి 47 డిగ్రీలకు చేరడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో 11 కేవీ ఫీడర్లపై లోడ్లు గరిష్ట స్థాయికి చేరి సబ్స్టేషన్లు నిప్పుల కొలిమిలా మారాయి. సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్లు), డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (టీఆర్లు) తీవ్ర ఒత్తిడిని ఎదురొంటున్నాయి. సాధారణంగా నియంత్రణ (60 నుంచి 70 డిగ్రీలు)లో ఉండే పీటీఆర్ల ఆయిల్ ఉష్ణోగ్రత ప్రస్తుతం 90 నుంచి 98 డిగ్రీల వరకు నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు వేడెకి సాంకేతిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉండడంతో విద్యుత్శాఖ అప్రమత్తమై, వినూత్నంగా ఆలోచించింది.
పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లకు కృత్రిమ శీతలీకరణ పద్ధతులతో గ్రిడ్ను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా పీటీఆర్, డీటీఆర్లపై గోనె సంచులు కప్పి వాటిపై నిరంతరం పైపులతో నీరు పోస్తూ చల్లబరుస్తున్నారు. కొందరు సిబ్బంది ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ల ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ డిమాండ్ ఒకసారిగా పెరగడంతో సబ్స్టేషన్లపై కూడా అధిక లోడ్ పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఓవర్ లోడ్ పరిస్థితులు ఏర్పడకుండా ప్రత్యామ్నాయ ఫీడర్ల ద్వారా సరఫరా మళ్లించే చర్యలు చేపట్టారు. అధికారులు అత్యవసర మరమ్మతు బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం హనుమకొండలో కేయూ, బాలసముద్రం, సోమిడి సబ్స్టేషన్లలో పీటీఆర్, డీటీఆర్లకు గోనె సంచులు వేసి నీటితో చల్లబరుస్తున్నారు.