శాయంపేట, జనవరి 10 : పొలంలోకి దిగి కూలీలతో కలిసి వరి నాటు వేశారు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి. మంగళవారం శాయంపేట నుంచి వెళ్తూ కొప్పుల శివారు పొలంలో మహిళా కూలీలు వరి నాటు వేస్తుంటే చూసి ఆగారు. అక్కడికి వెళ్లి కూలీలను ఆప్యాయంగా పలకరిస్తు సాదకబాధకాలు తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా పొలంలో దిగి మహిళా కూలీలతో కలిసి నారు పట్టుకుని నాటు వేసి ఔరా అనిపించారు. తెలంగాణ రాకముందు వానకాలం ఒకటే పంట వేసేవాళ్లమని, ఇప్పుడు రెండు పంటలు వేసుకుంటున్నామని ముచ్చటించారు.
గతంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు రైతుబంధు ఇస్తే ఎరువులు వస్తున్నాయి.. ఆనాడు చాలీచాలని కరంటుతో పొలం సగంలోనే ఎండిపోయేదని ఇప్పుడు వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్ వస్తున్నదని గుర్తు చేశారు. జడ్పీ చైర్పర్సన్ స్వయంగా వచ్చి తమతో నాటు వేయడంతో మహిళా కూలీల్లో సంతోషం వెల్లివిరిసింది. రైతులకు ఎన్నో చేస్తున్న సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలని మహిళా కూలీలు పేర్కొనడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.