నర్సంపేట, డిసెంబర్19 : రాష్ట్రంలోని పెద్ద నగరాలకు పోటీగా నర్సంపేట పట్టణం అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు నర్సంపేట సర్వతోముఖాభివృద్ధికి సుందరమైన రోడ్లు, సౌకర్యవంతంగా డ్రైనేజీల నిర్మాణం చేస్తున్నామన్నారు. ఈ పనులతో నర్సంపేట దశ మారుతుందన్నారు. తాజాగా మొదటి దఫాలో రూ.15 కోట్లు నిధులు విడుదల చేశారని తెలిపారు. కమ్యూనిటీ భవనాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం పనుల కోసం త్వరలో నిధులు మంజూరు కానున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ నేతృత్వంలో నర్సంపేట తలరాతను అద్భుతంగా మార్చుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణ ముఖచిత్రం ఇంకా సుందరంగా మారనుందని అన్నారు. తాను ఎన్నికైన తర్వాత నర్సంపేట అభివృద్ధికి విజన్ను రూపొందించి అమలు పరుస్తున్నామన్నారు. కేటీఆర్ మంజూరు చేసిన నిధులతో నర్సంపేటలో చేపట్టబోయే పనులను వివరించారు. రూ.4 కోట్లతో మాదన్నపేట రోడ్డు నుంచి రెడ్డి ఫంక్షన్హాల్ వరకు సల్లేజ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తామని తెలిపారు. రూ. 2 కోట్లతో ఆర్అండ్ బీ గెస్ట్హౌస్ నుంచి మార్ ఫంక్షన్హాల్ వరకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు.
రూ.1.80 కోట్లతో నర్సంపేట గ్రెయిన్ మార్కెట్ నుంచి మార్ ఫంక్షన్ హాల్ వరకు డ్రైనేజీ నిర్మాణం చేస్తామని తెలిపారు. రూ.1.50 కోట్లతో నర్సంపేటలోని ఆడిటోరియం బ్యాలెన్స్ పనుల నిర్మాణం చేస్తామని తెలిపారు. రూ.1.50 కోట్లతో నర్సంపేట కుమ్మరికుంట పార్క్ అభివృద్ధి పనులు చేయనున్నట్లు వివరించారు. రూ.1.30 కోట్లతో వరంగల్ రోడ్డు జంక్షన్ నుంచి అంబేద్కర్ సెంటర్ జంక్షన్ వరకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేస్తామని తెలిపారు. రూ. 90లక్షలతో నర్సంపేట జయలక్ష్మి సెంటర్ నుంచి పాకాల రోడ్డు వరకు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం చేస్తామని తెలిపారు. రూ. 70 కోట్లతో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి నెక్కొండ రోడ్డు కెనాల్ వరకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేస్తామని తెలిపారు. రూ.60 కోట్లతో పాకాల రోడ్డు నుంచి మహబూబాబాద్ బైపాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. రూ.70 లక్షలతో మున్సిపాలిటీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం చేస్తామని తెలిపారు.