దుగ్గొండి, నవంబర్ 27 : భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని వరంగల్ జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఆదివారం మండలంలోని గిర్నిబావిలో ఉన్న న్యూ విజన్ టెక్నో స్కూల్లో జనవిజ్ఞాన వేదిక వరంగల్ కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో జిల్లా స్థాయి చెకుముకి సంబురాలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 13 మండలాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, టీచర్లు హాజరు కాగా, గెలుపొందిన విద్యార్థులను రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు. ఆయా విద్యార్థులకు బహుమతులను అందజేశారు. న్యూ విజన్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందన్నారు. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశం గర్వించే శాస్త్రవేత్తలుగా ఎదిగిన సీవీ రామన్, ఏపీజే అబ్దుల్ కలామ్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం ద సైంటిస్ట్ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ప్రముఖ పర్యావరణవేత్త, అటవీ శాఖ జిల్లా అధికారి పురుషోత్తం మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదువుకొని దేశానికి సేవచేసే పౌరులుగా ఎదగాలన్నారు. జేవీవీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పెండెం భాస్కర్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, వనప్రేమి అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త రాయబోస్, న్యూ విజన్ స్కూల్ కరస్పాండెంట్ పోరెడ్డి నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ మహిపాల్రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర రిసోర్స్పర్సన్ సురేశ్, జేవీవీ శ్యామ్ పాల్గొన్నారు.