వరంగల్, నవంబర్ 19(నమస్తేతెలంగాణ) : అసంఘటిత రంగంలో ఉన్న రైతులందరినీ సంఘటిత రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రభు త్వం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వారిని ఒక తాటిపైకి తీసుకురావడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పీవో)ల ఏర్పాటును ప్రోత్సహిస్తు న్నది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీటికి సహా య సహకారాలను కూడా అందజేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 42 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏ ర్పడ్డాయి. రాష్ట్రంలో ఎఫ్పీవోలు ఎక్కువగా ఆవిర్భవించిన జిల్లాల్లో వరంగల్ ఒకటి కావడం విశే షం. ఇక్కడ ఎఫ్పీవోల ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక చొరవ కనబరుస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్క నర్సంపేట డివిజన్ పరిధిలోనే ఇప్పటివరకు 37 ఎఫ్పీవోలు ఆవిర్భవించాయి.
వీటిలో ప్రత్యేకంగా మహిళలవి మూడు ఉ న్నాయి. ఖానాపురం మండలంలోని అశోక్నగర్, ఖానాపురం, నర్సంపేట మండలంలోని ముగ్దుంపురం గ్రామంలో ఈ మహిళా ఎఫ్పీవోలు పని చే స్తున్నాయి. ప్రతి ఎఫ్పీవోలో 300 నుంచి 500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో ఎఫ్పీవోల ఏర్పాటు తో కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహకారంగా అందజేసే డబ్బును ఎఫ్పీవోలు తమ సంఘంలో వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకోవచ్చని చెబుతున్నారు. ఎరువులు, పురుగు మందు లు, విత్తనాలు వంటి వ్యవసాయ ఇన్పుట్లను టోకు గా అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రధానంగా వ్యవసా య అవసరాలకు కావాల్సిన పనిముట్లను నిరంతరం అందుబాటులో ఉండేవిధంగా ఎఫ్పీవోలు కస్టం హై రింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చని అవగాహన కల్పిస్తున్నారు.
అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను అనుకున్న సమయానికి, అతి తక్కువ ధరలో వినియోగించుకునే అవకాశం ఉందని, తద్వారా సంఘానికీ ఆదాయం సమకూరుతుందని వివరిస్తున్నారు. ఎఫ్పీవోలకు నాబార్డు నుంచి అతి తక్కువ వడ్డీ రేటుతో అ త్యధిక రుణాన్ని పొందే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. వ్యాపార అభివృద్ధికి నైపుణ్య శిక్షణ, అవగాహన కార్యక్రమాలను కూడా రైతు వేదికల ద్వారా నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల నుంచి ఖానాపురం, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, దుగ్గొండి, నల్లబెల్లి తదితర మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఎఫ్పీవోలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్తో పాటు నర్సంపేట ఏడీఏ అవినాశ్ వర్మ, మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సహకారంపైనా దృష్టి..
ఎఫ్పీవోలకు ఆర్థిక సహకారం అందడంపైనా అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ప్రభు త్వం రెండు ఎఫ్పీవోలకు రూ.1.20 కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది. నర్సంపేట, ఖానాపురం ఎఫ్పీవోలకు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం రూ.60 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత ఏడాది రెండు సీజన్లలో అధికారుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం జిల్లాలోని వివిధ ఎఫ్పీవోలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించింది. ఒక సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన పద్దెనిమిది ఎఫ్పీవోలకు కొద్ది రోజుల క్రితం కమీషన్కు సంబంధించిన సుమారు రూ.58 లక్షలను చెక్కుల రూపంలో అందజేసింది. నర్సంపేటలో జరిగిన ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో పాటు డీఏవో, ఏడీఏ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరో సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల కమీషన్ సుమారు రూ.కోటి రావాల్సి ఉంది. ఈ ఏడాది కూడా కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎఫ్పీవోలకు కేటాయించాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
తక్కువ వడ్డీపై..
ప్రస్తుతం ఎఫ్పీవోలకు వ్యవసాయ మౌలిక సదుపాయాల ఫండ్ ఇప్పించే పనిలో అధికారులు తలమునకలయ్యారు. ఈ ఏడాది రూ.22 కోట్లు ఇప్పించాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యంగా నిర్దేశించింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు కొద్ది రోజుల నుంచి ఎఫ్పీవోలకు సదస్సులు నిర్వహిస్తూ ఈ ఫండ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతికంగానూ సహకరిస్తున్నారు. ఒక్కో ఎఫ్పీవో రూ.2 కోట్ల వరకు తక్కువ వడ్డీపై ఆర్థిక సహకారం పొందే అవకాశం ఉందని డీఏవో చెప్పారు. ఎఫ్పీవోలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.