వరంగల్, నవంబర్ 12: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మడిపల్లిలో 150 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న మా సిటీలో ప్లాట్ల వేలానికి సర్వం సిద్ధం చేశారు. ఆదివారం మా సిటీ వేలం ప్లాట్ల వేలానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భారీ షామియానాలతోపాటు అన్ని వసతులు కల్పించారు. ఆజంజాహి మిల్లు భూముల్లో ఓ సిటీ పేరుతో కుడా అధికారులు చేసిన వెంచర్ విజయవంతమైంది. అదే స్ఫూర్తితో మడిపల్లిలో మా సిటీ పేరుతో ప్లాట్ల వేలం నిర్వహిస్తున్నారు. 2019 జనవరిలో మా సిటీలో ప్లాట్ల వేలం నిర్వహించారు. రెండో విడుత ఆదివారం చేపట్టనున్నారు. అయితే, మా సిటీ ప్లాట్ల ప్రారంభ ధర రూ. 8 వేలుగా నిర్ణయించారు. తొలి విడుత వేలంలో 3,500 రూపాయలుగా నిర్ణయించిన అధికారులు రెండో విడుత రెట్టింపు చేశారు.
10 ఫాంహౌస్ ప్లాట్లు..
మా సిటీ ప్లాట్ల వేలం పాటకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్లాట్ల వేలానికి వేదిక ఏర్పాటు చేశారు. ప్లాట్ల కోనుగోలు వచ్చే వారి కోసం షామియానాలు వేశారు. వేలంలో విక్రయించే ప్లాట్లను హద్దు రాళ్లు ఏర్పాటు చేసి మార్కింగ్ చేశారు. మా సిటీ 200, 300 గజాల ప్లాట్లు విక్రయించనున్నారు. తొలిసారిగా కుడా అధికారులు మా సిటీలో ఫాంహౌస్ ప్లాట్లను విక్రయించనున్నారు. 1000 గజాల చొప్పున 10 ప్లాట్లను కుడా అధికారులు సిద్ధం చేశారు. రాత్రి వరకు ప్లాట్ల వేలం జరిగే అవకాశాలు ఉంటాయన్న అంచనాతో అధికారులు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్లాట్ల వేలంలో పాల్గొనడానికి వచ్చే వారికి కుడా అధికారులు భోజన వసతి కల్పించారు.
ప్రత్యేక కౌంటర్లు
ఉదయం 9 గంటల నుంచి వేలం నిర్వహించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్లాట్ల వేలంలో పాల్గొనే వారు టోకెన్ అమౌంట్ చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొదట రూ. 25,000 టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. నేరుగా డబ్బులు చెల్లించే వారికి కోసం ప్రత్యేక కౌంటర్తో పాటు డీడీలు, స్వైపింగ్, ఆన్లైన్ చెల్లింపుల కోసం కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు వేలం నిర్వహించే ప్రాంగణంలో ప్రత్యేకంగా వివిధ బ్యాంకులు కౌంటర్లు ప్రారంభించాయి.
భారీ అంచనాలు
మా సిటీ ప్లాట్ల వేలానికి విశేష ఆదరణ ఉంటుందన్న విశ్వాసంతో కుడా అధికారులు ఉన్నారు. మా సిటీలో ప్లాట్ల వేలం అధికారులకు భారీ అంచనాలు ఉన్నాయి. 100 ప్లాట్ల వేలానికి అధికారులు సిద్ధం చేయగా ఇప్పటికే 200కు పైగా బుక్లెట్లు విక్రయించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకంతో మా సిటీ ప్లాట్ల వేలానికి మంచి స్పందన ఉంటుందన్న నమ్మకంతో అధికారులు ఉన్నారు.