కమలాపూర్, నవంబర్ 10 : వ్యవసాయానికి కూలీల కొరత నానాటికీ తీవ్రమవుతున్నది. ఈ క్రమంలో రైతులకు మేలు చేసేందుకు అనేక రకాల యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయం సులువుగా మారేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాల వినియోగంలో ఇస్తున్న ప్రోత్సాహం ఫలితాలనిస్తున్నది. కొత్తగా వడ్లను సంచుల్లో నింపే యంత్రం ఇప్పుడు అన్నదాతలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. కూలీల అవసరం లేకుండా పనులు చేసుకునేందుకు ఈ యంత్రం సహాయ పడుతున్నది. మండలంలోని ఉప్పల్కు చెందిన రైతు మిల్కూరి శ్రీధర్ ఈ కొత్త యంత్రం సాయంతో గన్నీ సంచుల్లో వడ్లను నింపడం స్థానిక రైతులను ఆలోచనలో పడేసింది.
ఇద్దరు ఉంటే చాలు :రైతు శ్రీధర్
నాకు మా ఊరిలో 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మొత్తం వరి సాగు చేస్తున్నా. ఆరబోసిన వడ్లను సంచుల్లో నింపేందుకు సకాలంలో కూలీలు దొరకడం లేదు. అందుకే వ్యవసాయ అధికారుల సలహాతో సంచుల్లో వడ్లు నింపే యంత్రాన్ని రూ. లక్షా 65వేలకు కొన్నా. గంటకు లీటర్ పెట్రోల్ ఖర్చవుతుంది. గంటకు 50 నుంచి 70 బస్తాలు నింపుతుంది. ఒక్కో బ్యాగు నింపితే కూలీలు రూ.5 నుంచి రూ.10 దాకా తీసుకుంటరు. యంత్రంతో అయితే లీటర్ పెట్రోలుతో నింపుకోవచ్చు. యంత్రంతో వడ్లను సంచుల్లో నింపేందుకు ఇద్దరు ఉంటే చాలు.