కాశీబుగ్గ, నవంబర్ 7 : కార్తీకమాసం రెండో సోమవారం సందర్భంగా కాశీబుగ్గ ప్రాంతంలోని కాశీవిశ్వేశ్వర రంగనాథస్వామి దేవాలయంలో శివలింగానికి 36 కిలోల పెరుగుతో అభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. శివలింగానికి సహస్ర అభిషేకం కనుల పండువగా సాగింది. అలాగే, కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణమని జ్యోతిష్య పండితుడు డాక్టర్ గోనె జగదీశ్వర్ తెలిపారు. ఆలయంలో రాత్రి జ్వాలాతోరణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ కలకోట గిరి, బయ్య స్వామి, డాక్టర్ గోనె జగదీశ్వర్, మండల శ్రీరాములు, ఓరుగంటి కొమురయ్య, బోడకుంట్ల వైకుంఠం, బొమ్మగాని కృష్ణమూర్తి, ముచ్చర్ల ప్రభాకరాచారి, పాశికంటి రమేశ్, బండారి భాస్కర్, నాగమల్ల సంచాక్షరయ్య, మౌటం శ్రీనివాస్, వెంకన్న, పోశాలు పాల్గొన్నారు.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట : కార్తీకపౌర్ణమి సందర్భంగా స్టేషన్రోడ్డులోని కాశీవిశ్వేశ్వర దేవాలయంలో జ్వాలా తోరణం, ఆకాశదీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు లంకా శివకుమార్శర్మ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. శివ నామస్మరణతో జ్వాలాతోరణం గుండా భక్తులను ప్రవేశం చేయించారు. అనంతరం ఆకాశదీపం వెలిగించారు. కార్యక్రమామంలో ఆలయ సిబ్బంది వీరన్న, లక్ష్మి పాల్గొన్నారు.
భద్రకాళి ఆలయంలో..
వరంగల్ : భద్రకాళి ఆలయంలో జ్వాలా తోరణం ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జ్వాలా తోరణం కింది నుంచి శివపార్వతుల విగ్రహాలను ఊరేగించారు. అనంతరం భక్తులు జ్వాలా తోరణం కింది నుంచి నడిచారు. కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు శేషు, అర్చకులు, ఈవో శేషుబారతి, ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.