వరంగల్, నవంబర్ 4 : పారదర్శకంగా, వేగంగా భవన నిర్మాణ అనుమతుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పకడ్బందీగా అమలవుతోంది. 2020 జూన్ నుంచి అమల్లోకి వచ్చిన టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేస్తున్నారు. అంతా ఆన్లైన్ విధానంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరవుతున్నాయి. మొదట్లో కలిగిన కొన్ని ఇబ్బందులు అధిగమించిన గ్రేటర్ టీఎస్ బీపాస్ విధానం ద్వారా భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీఎస్ బీపాస్ విధానం ద్వారా చేసుకున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ముందున్నారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ చేస్తుండడంతో టీఎస్ పాస్ విధానం సమర్థవంతంగా అమలవుతోంది.
8,265 దరఖాస్తుల స్వీకరణ..
టీఎస్ బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతుల మంజూరులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండో స్థానంలో ఉంది. టీఎస్ బీ పాస్ దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరిస్తున్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు టీఎస్ బీపాస్ ద్వారా 8,265 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5,591 దరఖాస్తులకు అనుమతులు ఇవ్వగా 1061ని తిరిస్కరించారు. 713 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా భవన నిర్మాణల అనుమతుల కోసం చేసుకున్న 6,425 దరఖాస్తుల్లో 4,877 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశారు. 202 ప్రాసెస్లో ఉండగా, 253 దరఖాస్తులు ఫీజులు చెల్లించాల్సి ఉన్నాయి. 1,092 దరఖాస్తులను తిరస్కరించారు. 75 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఒక రూపాయితో టీఎస్ పాస్లో 1,258 మంది నమోదు చేసుకున్నారు. వాటిలో 492 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయగా 766 దరఖాస్తులను తిరస్కరించారు. బహుళ అంతస్తుల భవనాల (అపార్ట్మెంట్లు, కమర్షియల్ నిర్మాణాలు) అనుమతుల కోసం 418 దరఖాస్తులు రాగా వాటిలో 347 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశారు. 71 దరఖాస్తులను తిరస్కరించారు. గ్రేటర్ పరిధిలో లేఔట్ల కోసం 51 దరఖాస్తులు రాగా వాటిలో 45 వాటికి అనుమతులు ఇవ్వగా 6 దరఖాస్తులను తిరస్కరించారు. టీఎస్ బీపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో గ్రేటర్ ప్రత్యేక దృష్టిసారిస్తోంది.
నిరంతర పర్యవేక్షణ..
టీఎస్ బీపాస్ అమలులో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్తో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ మెరుగైన ఫలితాలను అందిస్తోంది. ప్రతి వారం సీడీఎంఏ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీఎస్ బీపాస్ అమలుపై దిశానిర్దేశం చేస్తున్నారు. పురపాలక మంత్రి కేటీఆర్ ప్రకటించిన టెన్ పాయింట్ ప్రోగ్రాంలో ప్రత్యేకంగా టీఎస్ బీపాస్ అంశాన్ని చేర్చారు. భవన నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం దానిని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.