నర్సింహులపేట, అక్టోబర్ 11 : మిగతా పంటల కంటే ధర ఎక్కువ వస్తుందనే ఆశతో ఎంత కష్టమైనా పెట్టుబడి పెట్టి రైతన్న మిరప పంట సాగుచేస్తున్నాడు. అయితే ఇదివరకు పైముడత, కింద ముడతతో చిన్నపాటి ఇబ్బందులొచ్చినా పురుగుమందు కొట్టి పంటను కాపాడుకున్నాడు. ఆ తర్వాత వైరస్తో కొంత నష్టపోయినా పంటకు ధర ఎక్కువగా ఉందని ధైర్యంగా ఉన్నాడు. కానీ మొన్నటివరకు 15నుంచి 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే పంట కాస్త.. గతేడాది తామర పురుగు(ఫ్లవర్ త్రిప్స్) సోకి కాయలు రాలడంతో ఒక్కసారిగా 10 క్వింటాళ్లకు పడిపోయి రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఈ ఏడాది నవంబర్-జనవరి మధ్యకాలంలో తామర పురుగు ఆశించే అవకాశం ఉంది. రైతులు ముందస్తు జాగ్రతలు తీసుకోకుంటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని, జాగ్రతలు పాటించి తామర పురుగు రాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకుంటే నష్టం తగ్గించుకోవచ్చని ఉద్యాన శాఖాధికారులు సూచిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో 71,466 ఎకరాల్లో మిరుప సాగవుతోంది. మహబూబాబాద్, నర్సింహులపేట, మరిపెడ, కురవి, డోర్నకల్ మండలాల్లో 50వేల ఎకరాల వరకు రైతులు పంట వేశారు. ఈ ఏడాది మిరుప పంటను ప్లవర్ త్రిప్స్ చాలావరకు నష్టపరిచే అవకాశం ఉన్నది. ప్రస్తుతం పంట పూత దశలో ఉన్నది. ఈ కొత్త రకం వైరస్ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. గతేడాది డిసెంబర్- జనవరి కాలంలో జిల్లావ్యాప్తంగా 90శాతం పంటలకు ఫ్లవర్ త్రిప్స్ ఆశించినట్లు అధికారులు గుర్తించారు. దీని నివారణకు రైతులు ఈ ఏడాది ముందస్తుగా సామూహికంగా నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి పాటించాలి..
రైతులు విచక్షణారహితంగా పురుగు మందులు బయో మందులు(సింథటిక్ పైర్ల్రూయిడ్) పిచికారీ చేయడం వల్ల గుడ్లు పెట్టే సామర్థ్యం పెరుగుతుంది. ఇలాంటి మందుల పిచికారీ తగ్గించాలి.
నీలిరంగు జిగురు అట్టలు ఒక ఎకరానికి 16 నుంచి 20 వరకు ఏర్పాటు చేసుకోవడం వల్ల తల్లి పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు.
తామర పురుగు నివారణకు సామూహికంగా రైతులు నివారణ చర్యలు తీసుకోవాలి.
మిరుప పంట చుట్టూ ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ లేదా పాత చీరలు 4 నుంచి 6 ఫీట్ల ఎత్తు వరకు కట్టుకుంటే పక్క చెలక మిరుప నుంచి తామర పురుగులు రాకుండా నిరోధించవచ్చు.
జీవ శిలీంధ్రనాశిని అయినటువంటి బవేరియా, వర్టిసెల్లియం ఒక లీటర్కు 5 గ్రాములు, వేప నూనె 5 ఎంల్ కలుపుకొని పిచికారీ చేయాలి.
తక్షణ చర్యగా ఎసిటామిప్రిడ్ (పైడ్) 60 గ్రాములు, లేదా ఫిప్రోనిల్ 80 డబ్ల్యూజీ 60 గ్రాములు ఎకరానికి లేదా ఫిప్రోనిల్, ఇమిడాక్లొప్రడ్ మిశ్రమ మందులను వేప నూనె 10.000 పీపీఎం 2 ఎంఎల్ లీటర్కు కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.
రైతులకు అవగాహన కల్పిస్తాం..
మిరుప సాగులో కొత్తగా వచ్చిన తామర పురుగు నివారణకు మల్యాల శాస్త్రవేతలు రైతులకు అవగాహన కల్పిస్తారు. పంటల సాగులో వచ్చే చీడపీడల నివారణకు సలహాలు, సూచనలు తీసుకోవాలి.
– రాకేశ్, ఉద్యానశాఖాధికారి, తొర్రూరు