జఫర్గఢ్, అక్టోబర్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒరగబెట్టిందేమీ లేదని ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి తీవ్రంగా విమర్శించారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ)లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విభజన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైన దద్దమ్మ ప్రభుత్వం.. మోదీ ప్రభుత్వమంటూ మండిపడ్డారు. విభజన హామీల అమలుకు కృషిచేయని తెలంగాణలోని బీజేపీ నేతలు చవటలు, సన్నాసులని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడని.. ఉచితాలు వద్దు, సంక్షేమ పథకాలను రద్దు చేయాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలోని బడా, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు రూ.12లక్షల కోట్లను మాఫీ చేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తే రద్దు చేయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు ఇష్టమొచ్చినట్లు రూ.లక్షల కోట్లు మాఫీ చేయడం నరేంద్రమోదీ జాగీరు కాదన్నారు. ఎనిమిదేండ్లలో బీజేపీ పాలనలో భారతదేశం ఆర్థికంగా చాలా వెనుకబడిందని ఆందోళన వ్యక్తంచేశారు.
మోదీ సర్కారు హయాంలో రూపాయి విలువ రూ.82కి పడిపోవడం, విదేశీ మారక నిల్వలు రోజురోజుకూ పడిపోతుండడం ఆ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతున్నదన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ చలి మంటలను కాచుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కడియం విమర్శించారు. దేశానికి శాంతి మార్గాన స్వాతంత్య్రాన్ని అందించిన మహాత్మాగాంధీని, లాల్బహదూర్ శాస్త్రిని, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించేందుకు బీజేపీ వెనుకడుగు వేయడం లేదని ఆయన అన్నారు. బీజేపీ నేతలు హిట్లర్, నాజీ, సావాల్కర్, గాడ్సేలను పూజించేందుకు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రపూరిత విధానాలను తెలంగాణ ప్రజలు గమనించాలని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ కడియం కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న, పీఎసీఎస్ చైర్మన్ కర్ణాకర్రావు, సర్పంచ్ గాదెపాక అనిత పాల్గొన్నారు.