మార్మోగిన శివనామ స్మరణ
కార్తీక మాసం ఆదివారం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ నుంచే గాక వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు వచ్చారు. ముందుగా త్రివేణి సంగమం గోదావరి తీరంలో మహిళలు ప్రత్యేక దీపాలు వదిలి, సైకత లింగాలకు ప్రత్యేక పూజలు చేసి నదిలో కార్తీక దీపాలు వదిలారు. అనంతరం భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. శుభనందాదేవి (పారతీ అమ్మవారు) ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ఆవరణలోని తులసి చెట్టుకు పూజలు చేసి, ఉసరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అలాగే నేటి నుంచి 19వ తేదీ వరకు ఆలయ ఆధ్వర్యంలో గోదావరి మాతకు ఐదు రోజుల పాటు ప్రత్యేక హారతి ఇవ్వనున్నట్లు ఈవో మారుతి తెలిపారు.
ఇక్కడి ఆలయాలంటే చాలా ఇష్టం
జర్మనీకి చెందిన ఇన్సెంటీన్ మాట్లాతూ రామప్ప టెంపుల్ సూపర్బ్గా ఉందని, తనకు భారతీయ సంప్రదాయాలన్నా, ఇక్కడి దేవాలయాలన్నా చాలా ఇష్టమన్నారు. అందుకే భారతీయ సంప్రదాయ దుస్తులతోనే ఆలయ సందర్శనకు వచ్చానని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చందనాఖాన్ మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం వల్ల తెలంగాణ టూరిజం అ భివృద్ధి చెందుతుందన్నారు. ఆమె వెంట చరిత్రకారుడు శివనాగిరెడ్డి ఉన్నారు.
రామప్పలో సండే సందడి
మండలంలోని రామప్ప దేవాలయం సందర్శకులతో కిటకిటలాడింది. న్యూజిలాండ్ తెలుగు అసోసియన్ వ్యవస్థాపకుడు సీతారామారావు, ఐఏఎస్ చందనాఖాన్, చరిత్రకారులు శివనాగిరెడ్డి, జర్మనీకి చెందిన ఇన్సెంటీన్ వేరు వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్లు వివరించారు. కార్తీక మాసం కావడంతో శ్రీరామలింగేశ్వరుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని చెట్టుకింద ఉన్న శివలింగం వద్ద దీపాలు వెలింగించి పూజలు చేశారు. అనంతరం రామప్ప సరస్సుకు చేరుకుని బోటింగ్ చేసి ఆహ్లాదంగా గడిపారు.
మేడారంలో భారీగా భక్తజనం
మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ర్టాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. మొదటగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని న్యూజిలాండ్ తెలుగు అసోసియన్ వ్యవస్థాపకుడు సీతారామారావు అన్నారు. యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలిసి జనగామకు చెందిన మిత్రుడు భాస్కర్తో కలిసి చూడటానికి వచ్చానని చెప్పారు. న్యూజిలాండ్లో దేవాలయాలను తెలుగు అసోసియన్ తరపున నిర్మించామని, ఇక ముందు నిర్మించే ఆలయాల్లో రామప్ప ప్రత్యేకతలు ఉండేలా కృషి చేస్తామని అన్నారు.