నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 11: ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం అనివార్యమని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరిగేలా పక్కా ప్రణాళికతో పథకాలను అమలుచేస్తూ తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నారని పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యంతో పాటు డంపింగ్యార్డ్, హరితహారం, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, ఇంటింటికీ ఇంకుడు గుంతలు, సెగ్రిగేషన్ షెడ్లు, క్రీడా మైదానాలు.. ఇలా ప్రతి ఒక్కటి అందుబాటులోకి తీసుకొచ్చి రూపురేఖల్నే మార్చేశారని.. ఇదంతా కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్నింటా ప్రగతిబాట పట్టించి దేశంలో తెలంగాణను ముందువరుసలో నిలిపారంటూ కొనియాడుతున్నారు. ఇదే విధంగా దేశంలోనూ మార్పులు తీసుకొచ్చేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లితే భారత్ను ప్రపంచంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దవచ్చని కోరుకుంటున్నారు. ఇప్పటికే వివిధ రాష్ర్టాల ప్రజలు, రైతులు, రైతు సంఘం నాయకులతో పాటు సబ్బండ వర్గాలు ముక్తకంఠంతో కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగులు.. తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మంచి నిర్ణయం
పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా, ఉచిత కరంటు తదితర పథకాలు ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలనే దేశవ్యాప్తంగా అమలుచేయాలని చూడడం సరైనదే. అనేక రాష్ర్టాలు తెలంగాణను పథకాలను ఆదర్శవంతంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో కూడా అమలు చేస్తే అక్కడి ప్రజలకు మేలు జరుగుతుంది. కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడం గొప్ప విషయం. రాజకీయాలకు అతీతంగా దేశం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది.
– టి.చారి, ప్రభుత్వ ఉద్యోగి
దేశానికి ఇప్పుడు కేసీఆర్ అవసరం ఉంది..
తెలంగాణ సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో తప్పనిసరిగా మార్పు వస్తది. కేసీఆర్ ఎనిమిది ఏండ్లలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిపిండు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ రాష్ట్రంలోనూ కావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేసిన సందర్భాలను గతంలో ఎన్నోసార్లు చూశాం. ఇప్పటిదాకా ఢిల్లీ కేంద్రంగా సాగే దేశ రాజకీయాలతో కొన్ని రాష్ట్రాలకే లబ్ధి చేకూరుతోంది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా ప్రగతి ఫలాలు అందుతాయి. పీవీ నర్సింహారావు తర్వాత అంతటి పరిపాలనా అనుభవం, రాజకీయ చతురత, దేశాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉన్న నాయకుడు మన కేసీఆర్. దేశ రాజకీయాల్లో మార్పు ఆయనకే సాధ్యం. ఫలితంగా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుంది.
– కళకోల అశోక్బాబు, హెచ్ఈవో
దేశాన్ని మార్చే సత్తా కేసీఆర్కే ఉంది
జనరంజక పాలన, సంక్షేమ రాజ్యం రావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యం. ఆధునిక ప్రపంచ ప్రజాస్వామ్య పాలన చరిత్రలో తక్కువ సమయంలో ప్రజల జీవన ప్రమాణాల పెంపొందించి అద్భుతమైన ఫలితాలను సాధించారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక, ఆర్థిక రంగాలు 50 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. ఇటీవల మానవాభివృద్ధి నివేదికలో భారత్ సాధించిన ర్యాంక్ 132. విద్య, వైద్యం తలసరి ఆదాయాల్లో ఆఫ్రికా దేశాల కంటే తక్కువ స్థానంలో ఉన్నాం. మోదీ ప్రభుత్వంలో బడా పెట్టుబడిదారులకు కార్పొరేషన్ పన్నులను 34 శాతం తగ్గించిండు. దీని విలువ సుమారు రూ.20 లక్షల కోట్లు అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్లో నిరుపేదలు జీవించేందుకు సామాజిక భద్రత కోసం కేటాయిస్తున్న నిధులు కేవలం రూ. లక్ష కోట్లు మాత్రమే. బీజేపీ నుంచి దేశాన్ని కాపాడే సాహసం, జ్ఞానం కలిగిన ఉన్న నాయకుడు కేసీఆర్. కృష్ణా, గోదావరి నదుల నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్న కేసీఆర్, దేశంలోని జీవ నదుల నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి భారత్ను ఆహార గంపగా మార్చే సత్తా ఆయనకే ఉంది. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న సంఘ్ పరివార్ విపత్తు నుంచి దేశాన్ని కాపాడే సత్తా కేసీఆర్కు మాత్రమే ఉంది.
– అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యుడు
ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఆయనే..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షలు ఖర్చుతో కూడుకున్న డయాలసిస్ సేవలు ఇవాల పేదలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజంగా పేదలకు అందుతున్న చాలా అద్భుతమైన సేవ ఇది. అలాగే ఎవరికైనా గుండెపోటు వస్తే గోల్డెన్ అవర్లో ఇచ్చే మెడికేషన్స్ రూ.45వేల నుంచి రూ.90వేలుండే ఇంజెక్షన్లను పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. ఏ ఒక్క రోగికి అయినా సరే ఒక్క రూపాయి డబ్బు ఖర్చుపెట్టి బయట మందులు కొనే పరిస్థితి రావొద్దని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి సర్కారు దవాఖానలో పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందుతోంది. ఇలా వైద్య సేవారంగంతో పాటు సంక్షేమ రంగాల్లోనూ తెలంగాణ, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉంది. ఈ ఘనత సీఎం కేసీఆర్ది మాత్రమే. ప్రజల కోసం ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి ప్రస్తుతం దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు. కేసీఆర్ తప్పకుండా దేశ రాజకీయాల్లోకి రావాలని ఒక ప్రభుత్వ వైద్యుడిగా నేను బలంగా కోరుకుంటున్నా. ఆయనను ఆహ్వానిస్తున్నా.
-డాక్టర్ పీ సుగుణాకర్రాజు, జిల్లా ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్, జనగామ
అన్ని వర్గాలు బాగుపడుతయ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే వార్త తెలిసి సంతోషం అనిపించింది. కొట్లాడి ప్రత్యేక తెలంగాణ తెచ్చిన నాయకుడే.. రాష్ర్టాన్ని పరిపాలిస్తే బాగుంటుందని ప్రజలంతా ఒక్కటై టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేశారు. ఆశించినట్టే ఎన్నో దశాబ్దాలుగా తీరని ఎన్నో సమస్యలు తీరడమే గాక ఇటు ఊరూరా అభివృద్ధి, ఇంటింటా సంక్షేమంతో దూసుకుపోతూ దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఇదంతా కేసీఆర్ ముందుచూపు, పక్కా ప్రణాళికతో ఇంతటి గుర్తింపు సాధ్యమైంది. ఎనిమిదేళ్ల కేసీఆర్ మార్కు పాలనకు ఇది నిదర్శనం. తెలంగాణ తరహాలో దేశమంతటా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం శుభపరిణామం. దేశంలో ఉపాధి రంగాలకు ప్రోత్సాహం లేకుండా పోయింది. కేసీఆర్ లాంటి నాయకుడు వస్తే దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పటికే కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని ఎక్కడా లేని పథకాలతో నిరూపించుకున్నారు. అభివృద్ధికే కాదు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో కేరాఫ్గా నిలిచి, యావత్ దేశ దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేనని అందరు కోరుతున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది.
– మిట్టకోల సత్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్
అన్ని రాష్ర్టాలు బాగుపడుతాయ్..
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో ఎక్కడా లేని విధంగ అభివృద్ధి చేశారు. పట్టణాలకే పరిమితమైన పార్కులను పల్లెలకు పరిచయం చేశారు. ప్రతి ఊరిలో మొక్కల కోసం నర్సరీని ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనాలు, చెత్త ఎక్కడపడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డులు, మనిషి చనిపోతే అంత్యక్రియలకు ఇబ్బంది లేకుండా అధునాతన పద్ధతిలో శ్మశాన వాటికలు నిర్మించారు. సీఎం ముందుచూపుతో తీసుకొచ్చిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఇప్పుడు గ్రామాలను పచ్చనిహారంగా మార్చాయి. వీటి వల్ల వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురుస్తున్నాయి. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. చివరకు డయాలసిస్ రోగులకు కూడా పింఛన్ ఇచ్చి రాష్ట్ర సర్కారు ఆదుకుంటున్నది. మన రాష్ట్రంలో పెట్టిన ఈ అద్భుత పథకాలు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ప్రవేశపెడితే అక్కడి పేదలు బాగుపడుతరు. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది.
– జంగం పూర్ణచందర్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జేఏసీ కన్వీనర్
దేశ రైతులకు మేలు జరుగుతది
రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు. వ్యవసాయ రంగంలో పెను మార్పులు చేశారు. తెలంగాణ యాస, భాషను ప్రపంచానికి పరిచయం చేసిన మేధావి సీఎం కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా పథకం ప్రవేశపెట్టి రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నరు. దమ్మున్న లీడర్. మొన్న ఢిల్లీలో రైతులు ధర్నాలు చేసి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అప్పుడు తోడా సమజ్ చేసిన. తెలంగాణలో రైతులకు అందుతున్న పథకాలు దేశం మొత్తం ఉంటే బాగుండని. ఇక్కడ రైతులు పండిస్తున్న పంటలను దాచేందుకు స్థలాలు సరిపోవడం లేదు. రైతులకు అందుబాటులో ఉండడానికి వ్యవసాయ శాఖలో స్టాఫ్ను సైతం పెంచారు. దీంతో గ్రామ గ్రామాన పంటల పరిశీలన, రైతులకు సూచన, అవగాహన కల్పించే కార్యక్రమాలు సులువుగా మారాయి. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు పోతె అందరు రైతులకు మేలు జరుగుతుందని అనుకుంటున్న. ప్రజల మేలు కోరే నాయకుడికి ఎక్కడైనా దువా ఉంటుంది. కేసీఆర్ పీఎం అయితే దేశానికి మంచి నాయకుడు దొరికినట్లే. – కేఏ గౌస్హైదర్, జిల్లా వ్యవసాయాధికారి, ములుగు
విజన్ ఉన్న నాయకుడు
సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే ఇండియా భవిష్యత్ మారుతది. ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంచడమే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నరు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు ఇస్తున్నరు. రైతు బంధు, తాగునీరు లాంటి కార్యక్రమాలు రాష్ర్టానికి ఎంతో పేరు తెచ్చాయి. పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం మెరుగుపడింది. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సాగునీరు అందిస్తున్న ఘనత ఆయనకే దక్కింది. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ప్రక్రియ కూడా కేసీఆర్తోనే అవుతుంది. ఇది చేస్తే దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. అలాగే ఉద్యోగుల సమస్యలను సైతం ఎప్పటికప్పడు పరిష్కరిస్తున్నరు. ఇవన్నీ దేశవ్యాప్తంగా అమలుకావాలంటే కేసీఆర్లాంటి ముందుచూపు ఉన్న వ్యక్తి అవసరం. ఇప్పటికే రూరల్ డెవలప్మెంట్ ద్వారా గ్రామాల్లో అనేక మౌలిక వసతులు కల్పించడంతో రాష్ట్రంలోని చాలా గ్రామాలకు అవార్డులు వచ్చాయి. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసే అవకాశం ఉంటుందని సబ్బండ వర్గాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి.
– ఏ శ్రీనివాస్కుమార్, డీఆర్డీవో, హనుమకొండ
చారిత్రక అవసరం
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం. దేశ ప్రజలందరూ అదే కోరుకుంటు న్నరు. ఆయన వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఆశిస్తున్నరు. గతంలో తెలంగాణలో ఎన్నడు జరుగని విధంగా ఎనిమిదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశానికే నమూనాగా మారింది. సీఎం కేసీఆర్ తెలం గాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నరు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశం మొత్తం జరుగాలని ప్రజలు అభిప్రాయపడుతు న్నరు. వ్యవసాయంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టడంతో భూగర్భ జలాలు పెరిగి సాగు నీటికి ఢోకా లేదు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అసరా పెన్షన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు అమలు చేస్తూ కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రాణాలను సైతం తెగించి పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావడం అసాధ్యం ఏమీ కాదని దేశ ప్రజలు విశ్వసిస్తున్నరు.
– పుల్లూరు వేణు గోపాల్, వయోజన విద్య సూపర్వైజర్, హనుమకొండ
కేసీఆర్ సారథ్యంలో విప్లవాత్మక మార్పులు..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం. తెలంగాణ తరహాలో దేశమంతటా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయి. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం విజన్ ఉన్న ఒక్క కేసీఆర్కే సాధ్యం. అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు న్యాయం జరుగడమే గాక దేశంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం ఎంతో ఉన్నది. ఆయన సారథ్యంలో దేశం పురోగమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
– ఎం.మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా