వర్ధన్నపేట, సెప్టెంబర్ 4 : ‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు గోసలు పడ్డరు. కేసీఆర్ చేపట్టిన ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రజలు వెన్నుదన్నుగా నిలిచారు. 12 ఏళ్లపాటు జరిగిన పోరాటం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో 8 ఏళ్లలోనే తెలంగాణ ప్రజలు, మేధావులు కన్న కలలు క్రమంగా సాకారమవుతున్నాయి.’ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఆదివారం వర్ధన్నపేట పట్టణ సమీపంలోని లక్ష్మీ గార్డెన్స్లో గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీళ్లుగా ఉన్న భూములు సస్య శ్యామలవుతున్నాయని అన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నాయకులు చిల్లర విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరారు. అలాగే, పట్టణ పరిధిలో పట్టణంలో 1,310 మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా కొత్తగా మరో 464 మందికి పింఛన్లు మంజూరయ్యాయని వివరించారు. వీరికి ప్రతి నెలా రూ.38లక్షలు పంపిణీ చేస్తామన్నారు. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు అందుతుండడంతో గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం..
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పింఛన్ లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే అరూరి క్షీరాభిషే కం చేశారు. పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్న సీ ఎంకు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపా రు. అనంతరం ఎమ్మెల్యే వృద్ధులతో కలిసి భోజ నం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ వైస్చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, కౌన్సిలర్లు రాజమణి, సుధీర్, రవీందర్, సుజాత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పెన్షన్లు..
కరీమాబాద్ : పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. 43వ డివిజన్ మామునూరులోని ఓ ఫంక్షన్ హాల్లో 43, 44 డివిజన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ పెన్షన్లు వస్తాయన్నారు. రాష్ట్రంలో 10 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలువాలన్నారు.