వరంగల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తోది. ఇప్పటికే జిల్లాలో 27 తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణం పూర్తి చేసింది. మరో 58 క్రీడా ప్రాంగణాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ కోర్టులను ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక వసతుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి గ్రామానికో తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో అధికారులు ఊరూరా తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. వీటిలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం అంచనాలు వేశారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ కోర్టుల నిర్మాణం, లాంగ్జంప్, సింగిల్బార్, డబుల్ బార్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. పాలనాపరమైన అనుమతుల కోసం విడుతల వారీగా ప్రభుత్వానికి పంపుతున్నారు. నిధులు మంజూరు కాగానే సాంకేతిక అనుమతులు పొంది తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు చేపడుతున్నారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ప్రభుత్వం 131 తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. రాయపర్తి మండలంలో 16, సంగెంలో 15, వర్ధన్నపేట, నెక్కొండ, గీసుగొండలో 14 చొప్పున, చెన్నారావుపేటలో 13, పర్వతగిరిలో 12, నర్సంపేటలో 10, నల్లబెల్లి, ఖానాపురంలో 9 చొప్పున, దుగ్గొండిలో 5 ఉన్నాయి.
ఈ క్రీడా ప్రాంగణాల నిర్మాణం కోసం ప్రతిపాదనల ప్రకారం నిధులు కేటాయించింది. దీంతో అధికారులు 85 తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టారు. ప్రతి క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ కోర్టులను నిర్మిస్తున్నారు. లాంగ్జంప్, సింగిల్బార్, డబుల్బార్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం వరకు 27 తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో పర్వతగిరి మండలం నంబర్వన్ స్థానంలో ఉంది. ఈ మండలంలో ఆరు క్రీడా ప్రాంగణాల నిర్మాణం పూర్తయింది. గీసుగొండ మండలంలో 4, ఖానాపురంలో 3, చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, రాయపర్తి, సంగెం మండలాల్లో రెండేసి, నర్సంపేట, వర్ధన్నపేట మండలాల్లో ఒక్కో తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
వీటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రజాప్రతినిధులు ప్రారంభించి యువతకు అందుబాటులోకి తెచ్చారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వాలీబాల్ ఆడి క్రీడాకారులకు ఉత్సాహాన్నిచ్చారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు తమకు అందుబాటులోకి వస్తుండడంతో యువతలో ఆనందం వెల్లివిరుస్తోంది. నిర్మాణం పూర్తయిన తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో యువకులు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఆడుతున్నారు. లాంగ్జంప్, సింగిల్బార్, డబుల్బార్ వంటివి చేస్తున్నారు.
సిద్ధమవుతున్న మరో 58 క్రీడా ప్రాంగణాలు
మరో 58 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయి. సాధ్యమైనంత త్వరలో వీటిని యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఎంపిక చేసిన స్థలాలను పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు లెవలింగ్ చేసి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ క్రీడా ప్రాంగణాల్లో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ కోర్టులను విధిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి క్రీడా ప్రాంగణంలో లాంగ్జంప్, సింగిల్బార్, డబుల్బార్ వంటి వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అత్యధికంగా రాయపర్తి మండలంలో 14 క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్దన్నపేటలో 9, సంగెంలో 8, గీసుగొండ, చెన్నారావుపేటలో ఐదేసి, నెక్కొండ, పర్వతగిరిలో నాలుగేసి, ఖానాపురంలో 3, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో రెండేసి క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇతర గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. స్థలం గుర్తింపు జరిగిన గ్రామంలో ఇంజినీర్ల అంచనాల మేరకు ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తుంది. ఒక్కో క్రీడా ప్రాంగణం నిర్మాణం కోసం అధికారులు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఊరూరా ఓ నర్సరీ, పల్లె ప్రకృతివనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం వంటివి నిర్మించిన ప్రభుత్వం వీటికి తోడు తాజాగా ఓ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తోంది.