వర్ధన్నపేట, ఆగస్టు 26: వాణిజ్య బ్యాంకులకు తీసిపోకుండా ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే జిల్లా సహకార బ్యాంకు లక్ష్యమని వరంగల్ డీసీసీబీ ఉమ్మడి జిల్లా చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖాన సమీపంలో నిర్మిస్తున్న నూతన డీసీసీబీ భవనాన్ని స్థానిక అధికారులు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నాతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంలో వరంగల్ జిల్లా సహకార బ్యాంకు సేవలను విస్తరించినట్లు వెల్లడించారు. ఖాతాదారులు, రైతులకు సహకార బ్యాంకు ద్వారా అన్ని రకాల రుణాలు అందిస్తూ బ్యాంకు సేవలను విస్తృత పరిచామన్నారు. ప్రధానంగా వాణిజ్య బ్యాంకులకు తీసిపోకుండా చిరువ్యాపారులకు సైతం రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు.
రుణాల రికవరీ..
గతంలో పేరుకుపోయిన బకాయిలను కూడా అధికారులు రికవరీ చేస్తూ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మార్నేని వివరించారు. రానున్న రోజుల్లో డీసీసీ సేవలను మరింత విస్తరించి ప్రజలకు అవసరమైన అన్ని రకాల రుణాలను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాకుండా మండలకేంద్రాల్లో పీఏసీఎస్లు, బ్యాంకులకు అధునాత వసతులతో నూతన భవనాల నిర్మాణం కూడా చేపడుతున్నామని చెప్పారు. వర్ధన్నపేటలో నిర్మిస్తున్న బ్యాంకు భవన నిర్మాణం పూర్తి కావొచ్చిందన్నారు. త్వరలోనే బ్యాంకు, పీఏసీఎస్ సేవలను నూతన భవనంలోకి మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రవీందర్రావు వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రవణ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేశ్, పీఏసీఎస్ సీఈవో వెంకన్న పాల్గొన్నారు.