స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 25: రాష్ట్రంలో మూడోసారి టీఆర్ఎస్ అధికారంలో వచ్చి కేసీఆర్ సీఎం అయ్యేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. గురువారం స్టేషన్ఘన్పూర్లో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన నియోజకవర్గంలో రూ. 41 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, రూ. 2.50 కోట్ల ఎమ్మెల్సీ నిధులు, అదనంగా రూ. 50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ను అందించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ పచ్చని తెలంగాణలో బండి సంజయ్ కొనసాగిస్తున్న పాదయాత్రలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఇలాంటి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని, దీన్ని గుర్తించి తెలంగాణలో మూడోసారి గులాబీ జండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. 1994కు ముందు నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, గురుకులాలు, జూనియర్ కళాశాలలు, సాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పది సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ప్రజల కోసం టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరానని, అమర వీరుల త్యాగ ఫలితంగా రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కరించలేదన్నారు. నియోజకవర్గం ఎప్పుడూ అండగా ఉందని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని ఆయన అన్నారు. అధికారం అనేది ప్రజలు పెట్టే భిక్ష అని, అధికారంతో ఏనాడూ పెత్తనం చేయలేదన్నారు. పైరవీలు, పనులు, పదవులకు ఏనాడూ లంచం తీసుకోలేదన్నారు. అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ అందుకున్నవారు అనవసరపు ఖర్చులు చేయవద్దని, నీతిగా పనులు చేసి లాభం పొందాలన్నారు. కార్యకర్తలు అభివృద్ధి చెందితేనే పార్టీకి ఉపయోగపడుతారని అన్నారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి వాటికి దరఖాస్తు చేసుకునే నిరుపేదల వద్ద ఎలాంటి కమీషన్లు తీసుకోవద్దని, అవసరమైతే కార్యకర్తలే బస్సు చార్జీలు భరించాలని టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. తనకు అండగా ఉంటున్న టీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నా మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని, మనకు మంచి రోజులు రానున్నాయని, కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. స్టేషన్ఘన్పూర్, జనగామ, చేర్యాల ప్రాంతాలు సాగునీరు లేక కరువు కాటకాలతో అల్లాడుతుంటే సమస్య పరిష్కరానికి ఆనాడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. ప్రాజెక్టు దేవతలకు అర్థం కాదంటూ పిండ ప్రదానాలు చేసిన వారే నేడు దేవాదులకు దండాలు పెడుతున్నారని కడియం పేర్కొన్నారు. నియోజకవర్గంలో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఇంకా సాగునీరు ప్రాంతాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రి సహాయంతో సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. మల్లన్నగండి రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలోని 50 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా, 30 చెరువులు నింపుకున్నామన్నారు.
పామునూర్ ఫీడర్ చానల్ మరమ్మతులకు ఎస్టిమేట్లు తయారుచేసి సీఎంకు అందించామని, రూ. 4 కోట్లు త్వరలోనే మంజూరు చేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు రాంబాబు, సర్పంచ్లు నగరబోయిన మణెమ్మ, పోగుల సారంపాణి, కోతి రేణుక, గాదే చంద్రయ్య, ఉప్పలస్వామి, తాటికాయల సర్పంచ్ పెసరు రమేశ్, చిల్పూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు బూర్ల లత, రజాక్ యాదవ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, చిల్పూర్ వైస్ ఎంపీపీ భూక్యా సరిత, మాజీ ఎంపీపీ జగన్మోహన్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ బ్రహ్మారెడ్డి, రాపోలు మధుసూదన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ స్వామినాయక్, పల్లె రవి, జనగాం యాదగిరి, ఇల్లందుల సుదర్శనం, సాగనీటి సాధన కమిటీ చైర్మన్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, తెల్లాకుల రామకృష్ణ, ఆకుల నర్సయ్య, మాజీ సర్పంచ్ నరేందర్, ఆకుల నర్సయ్య, తీగల కరుణాకర్, ఐలోని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.