వరంగల్, ఆగస్టు 25: నగరంలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఆమె మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. బతుకమ్మ చీరలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న క్రమంలో ఈ ఏడాది బతుకమ్మ పండుగ నేపథ్యంలో పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. డివిజన్ల వారీగా ప్రణాళికలు చేయాలని ఆదేశించారు. నరగవ్యాప్తంగా పచ్చదనానికి ప్రతి డివిజన్లోని ఇంటింటికీ మొక్కలు ఉచితంగా అందజేయాలన్నారు. కార్పొరేటర్ల భాగస్వామ్యంతో మొక్కలు పంపిణీ చేయాలన్నారు. వినాయక చవితి సందర్భంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను డివిజన్ల వారీగా పంపిణీ చేయనున్నామని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా బతుకమ్మ చీరెలు, మొక్కలు, మట్టి విగ్రహాల పంపిణీలో సీవోలు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సకినాల రమేశ్, శ్రీలత, సఫియా, మాధవి, అలీ పాల్గొన్నారు.