నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వెట్టిచాకిరి నుంచి విముక్తులను చేసేందుకు ఉద్యమించాడు. తన రచనల ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతం చేసి చెరగని ముద్రవేసుకున్న దాశరథి రంగాచార్యులు.. సాహితీవేత్తగా, సాయుధ పోరాట యోధుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు. వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు 24 ఆగస్టు, 1928లో జన్మించారు. భూస్వాములు, పెత్తందార్ల చర్యలను సహించలేని దాశరథి కుటుంబం పూర్వ ఖమ్మం జిల్లా గార్లకు మకాం మార్చారు. అక్కడే రంగాచార్యుల విద్యాభ్యాసం కొనసాగింది.
‘దాశరథి మండలం’గా నామకరణం చేయాలి
దాశరథి సోదరుల పేరున చిన్నగూడూరు మండల కేంద్రానికి ‘దాశరథి చిన్నగూడూరు’గా నామకరణం చేయాలని ప్రజలు కోరుతున్నా రు. అలాగే ఇద్దరు సోదరుల విగ్రహాలను హైదరాబాద్లోని ట్యాంక్బండ్ పై ఏర్పాటు చేసి సముచిత స్థానం కల్పించాలని మండల ప్రజలు, సాహితీవేత్తలు కోరుతున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి దాశరథి సోదరుల విగ్రహాలను అడ్డగోడ నరేశ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. అలాగే మండల కేంద్రంలో వారి పేరున స్మృతివనం, హైదరాబాద్లో విగ్రహాలు ఏర్పాటుచేసి సముచిత స్థానం కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. దాశరథి రంగాచార్యుల జయంతిని బుధవారం ఘనంగా జరుపుకొనేందుకు గ్రామ యువకులు, ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా సాహితీవేత్తలు, దాశరథి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
ఉద్యమమే ఊపిరిగా, సాహిత్యమే ఆస్తిగా భావించాడు. నిజాం పాలనలో అరాచకాలు, పెత్తందార్ల దోపిడీ నుంచి ప్రజలను విముక్తుల్ని చేసేందుకు పన్నెండేళ్లకే ఉద్యమబాట పట్టాడు. ‘జీవనయానం’లో తన స్వగ్రామం చిన్నగూడూరు గురించి ‘చిన్ననాటి చందమామ.. నా అందాల రాశి’ అంటూ వర్ణిస్తూ.. ఆకేరు, తుమ్మల, ముత్యాలమ్మ చెరువులు, పంటలతో ఊరి చుట్టూ పరుచుకున్న ప్రకృతి రమణీయతను ఆవిష్కృతం చేశాడు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, తెలంగాణ పోరాట యోధుడిగా ఖ్యాతి గడించాడు దాశరథి రంగాచార్యులు. నేడు(బుధవారం) ఆ మహనీయుడి జయంతిని మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఘనంగా నిర్వహించనున్నారు.
12 ఏండ్లకే ఉద్యమబాట
బాల్యం నుంచే ఉద్యమభావజాలం కలిగిన రంగాచార్యులు నిజాం పాలనలో ప్రజలపై జరుగుతున్న అరాచకాలు, పెత్తందార్ల దోపిడీ నుంచి ప్రజలను విముక్తులను చేసేందుకు ఉద్యమబాట పట్టారు. ఇలా 12 ఏండ్లకే ప్రజాపోరాటాలకు అంకితమయ్యారు. తన రచనలతో ప్రజలను జాగృతం చేస్తూ 1946 నుంచి 1951వరకు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు. చిన్నగూడూరు నాటి గార్ల సంస్థానంలో ఉండేది. రంగాచార్యులు తన అన్న కృష్ణమాచార్యులుతో కలిసి సుమారు దశబ్దమున్నర పాటు గార్లలో జీవించారు. అతడి ఉద్యమపోకడలను గుర్తించిన నిజాం పాలకులు అరెస్ట్ చేసి జైల్లో బంధించారు. చెరసాల నుంచి తప్పించుకుని అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని కొనసాగించారు. మోదుగుపూలు, చిల్లరదేవుళ్లు, వేదాల అనువాదం, జీవనయానం, జనపదం.. ఇలా పలు అద్భుతమైన రచనలు చేసి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకొని తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
సత్కారాలు-పురస్కారాలు
చిల్లర దేవుళ్లు నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం
వేదాల అనువాదం, మహాభారతం అనువాదానికి గాను అభినవ వ్యాసుడు బిరుదు
1980లో వెంకటశివయ్య సాహితీ పురస్కారం
1994లో సాహితీ హారతి ఆధ్వర్యంలో ఖమ్మం వేదికగా వెండి కిరీటంతో సత్కారం
2000 సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో విశిష్ట పురస్కారం