వరంగల్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నదని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడంపై పలు సందర్భాల్లో కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించిందని గుర్తు చేశారు. శాసనమండలి వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం వరంగల్ కలెక్టరేట్ వద్ద మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి అభ్యర్థి పోచంపల్లి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసుకున్నం. తండాలు, గూడేలనూ పంచాయతీలుగా మార్చుకున్నం. సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు బాగుపడ్డాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో 90శాతం మంది టీఆర్ఎస్ వాళ్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి గెలుపు ఖాయం. ఎన్నిక ఏకపక్షం కానుంది’ అని మంత్రి దయాకర్రావు స్పష్టం చేశారు. ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాలే కాదు.. గౌరవ వేతనం కూడా ఎక్కువే ఉందన్నారు. ఇక్కడ స్థానిక సంస్థలకు మరే రాష్ట్రంలోనూ లేని విధంగా నిధులొస్తున్నాయని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ పోచంపల్లి రెండేన్నరేళ్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలు, నిధుల కేటాయింపు, గౌరవ వేతనం పెంపు కోసం పట్టుబట్టారని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి శాసనమండలిలో ప్రస్తావించారని చెప్పారు. ఎవరైనా రెచ్చగొడితే స్థానిక ప్రజాప్రతినిధులెవరూ పోటీచేయవద్దని, పోచంపల్లిని ఏకగ్రీవం చేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాధిస్తా : పోచంపల్లి
ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లి మాట్లాడుతూ 2019 జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు అవకాశం ఇచ్చారని, ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్తో పాటు ఎమ్మెల్యేల సహకారంతో దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలిచానని చెప్పారు. రెండున్నరేళ్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉన్నానని, వారికి టచ్లో ఉంటూ ఎమ్మెల్యేల సమన్వయంతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. కౌన్సిల్లో ఐదు సార్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను ప్రస్తావించానని చెప్పారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని, మరోసారి తనకు అవకాశం వచ్చినందున వాటిని కూడా పరిష్కరిస్తానని చెప్పారు. వరసగా రెండోసారి అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవారెడ్డి, మేయర్ సుధారాణి పాల్గొన్నారు.
వరంగల్పై కేసీఆర్కు గౌరవం : మంత్రి సత్యవతి
మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు హైదరాబాద్ తర్వాత వరంగల్ అంటే గౌరవమని, ఇక్కడి నాయకులపై ప్రేమ ఉందన్నారు. కొద్దిరోజుల క్రితం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే వాటిలో నాలుగింటిని కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లాకు కేటాయించారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంపల్లికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్తో ఉన్న అనుబంధంతో ఆయనకు మరోసారి ఇక్కడినుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. యువనేత పోచంపల్లి తన స్వగ్రామం వరికోలు సమగ్రాభివృద్ధికి పాటుపడ్డారని, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని శ్రీమంతుడు సినిమా వచ్చిందని మంత్రి సత్యవతి తెలిపారు. స్థానిక సంస్థల బలోపేతం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రతి జిల్లాలో అదనపు కలెక్టర్ పోస్టు కేటాయించిందని, అదనపు కలెక్టర్ ప్రత్యేకంగా స్థానిక సంస్థలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.