హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(పీఏసీఎస్) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్(పిక్స్)కమిటీలను నియమించినట్టు వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టంప్రకారం ఈ కమిటీలు ఆర్నెల్లపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, తాడికల్, మెట్పల్లి, వరంగల్ జిల్లా అమీనాబాద్, ఖానాపూర్, మహ్మదాపూర్, మందపల్లి, సూరిపల్లి, రెడ్లవాడ, చెన్నారావుపేట, గురిజాల, నర్సంపేట, వికారాబాద్ జిల్లాలోని కులచర్ల, పరిగికి ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీలు నియమించినట్టు వెల్లడించారు. ఈ కమిటీలు తక్షణం బాధ్యతలు స్వీకరించాలని సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్ను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు.