వర్ధన్నపేట, ఆగస్టు 23: రైతులు ఇష్టానుసారంగా పంటలపై రసాయనిక ఎరువులు వాడకుండా నిపుణుల సూచనల మేరకు వాడితే మేలైన దిగబడి సాధించొచ్చని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. ల్యాబర్తి క్లస్టర్ పరిధిలోని బొక్కలగూడెం గ్రామాన్ని మోడల్ గ్రామంగా వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ల్యాబర్తి రైతు వేదికలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సును సర్పంచ్ వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేడీఏ హాజరై రైతులు పంట భూములను సారవంతంగా తయారు చేసుకునేందుకు ఏటా విధిగా పచ్చిరొట్టను సాగు చేయడం, పీఎస్బీ ఎరువును తయారు చేసుకొని వాడుకోవడం, వరిలో వెదజల్లడం, డ్రమ్సీడర్ సాగు, అధిక సాంధ్రత పత్తిని సాగు చేసుకునే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ నాలుగు అంశాలను రైతులు పాటిస్తే భూములు సారవంతంగా తయారై అధిక దిగుబడి పొందుతారని, తద్వారా రైతులు ఆర్థిక ప్రగతి సాధిస్తారని వివరించారు. ఈ విషయాలపై ఏఈవోలు ఇప్పటికే రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా వరి పంటలో రైతులు యూరియాను అధిక మోతాదులో వాడకుండా దశల వారీగా వేసుకుంటే చీడపీడల నివారణ జరిగి పంట దిగుబడి పెరుగుతుందని జేడీఏ వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ నిపుణులు స్టీవెన్ బ్రోన్స్టన్, శ్రీనివాస్, సాధన, ఏడీఏ సురేశ్కుమార్, ఏవో రాంనర్సయ్య, ల్యాబర్తి సర్పంచ్ రాజు, ఎంపీటీసీ ఉమాదేవి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
నల్లబెల్లి: పంటల సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జేడీఏ ఉషాదయాళ్ అన్నారు. ఈ సందర్భంగా రుద్రగూడెం, నాగరాజుపల్లెలో ఆమె పంటలను క్షేత్ర పరిశీలన చేశారు. రైతులు విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం వైపు మొగ్గు చూపాలని జేడీఏ కోరారు. ప్రధానంగా రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలను సంబంధిత వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందితో నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్నదాతలు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధిస్తారని చెప్పారు. ఆమె వెంట జాతీయ ఆహార భద్రతా మిషన్ కోఆర్టినేటర్ సారంగం, ఏఈవో భాస్కర్, రైతులు పాల్గొన్నారు.